Corona Vaccine: ఏపికి మరో లక్షా 92 వేల కోవిడ్ వ్యాక్సిన్ లు చేరుకున్నాయి. మొదటి రెండు విడతల వ్యాక్సినేషన్ల సమయంలో అనేక అపోహాలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాని ప్రజానీకం ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో టీకా కోసం పోటీలు పడుతున్నారు. వ్యాక్సిన్ డోస్ కోసం టీకా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారికందరికీ వ్యాక్సిన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేస్తున్న టీకా డోసులతో పాటు ఉత్పత్తి సంస్థల నుండి నేరుగా కూడా లక్షలాది డోస్ లను కొనుగోలు చేస్తున్నది. అయితే ఈ నెల 15వ తేదీ వరకూ రాష్ట్రానికి వచ్చే వ్యాక్సిన్ లను ఇంతకు ముందు మొదటి డోసు వేసుకున్నవారికి రెండవ డోస్ గా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండ్ డోస్ అందరికీ పూర్తి అయిన తరువాత మొదటి డోస్ వేయడం ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో నేడు పూణే లోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం నుండి రోడ్డు మార్గంలో రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడ నుండి వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో వివిధ జిల్లాలకు రేపు ఉదయానికి వ్యాక్సిన్ డోసులను తరలించనున్నారు. ఈ నెల 15వ తేదీ లోగా మరో 17 లక్షల డోసులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి గురువారం కరోనాపై సమీక్షలో వ్యాక్సినేషన్ వేగవంతంపైనా పలు సూచనలు చేశారు. మొదటి డోస్ వేయించుకున్న ప్రజలు రెండవ డోస్ కోసం తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులను అందిస్తున్నారు.