Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంతో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. 18 ఏళ్ల నుండి 45 సంవత్సరాల లోపు వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉచిత వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపి ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ అంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో నేడు మచిలీపట్నం ఎంపి బాలశౌరి ఈ కార్యక్రమానికి తన వంతుగా రూ.20లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఏపి సీఐడి అదనపు డీజీపీ పివి సునీల్ కుమార్ తన ఒక నెల వేతనం రూ.3లక్షల 8వేలు విరాళంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే క్రమంలో పలువురు ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి సన్నద్దం అవుతున్నారు. అయితే నేడు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సినేషన్ కు సంబంధించి నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ ఖర్చు రాష్ట్రాలపై భారం కాకుండా ఉండేందుకు కేంద్రమే ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
Corona Vaccine: నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితం
అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందనీ, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ.2500కోట్లకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యంకాదని అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని కేసిఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సినే తయారు చేస్తున్నదనీ, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరిీ కొన్ని సంస్థలు వ్యాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయి కాబట్టి వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని సీఎం స్పష్టం చేశారు. తనకు రెండు మూడు రోజుల్లో అవసరమైన వైద్య జరిగి పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని కేసిఆర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతం అవ్వడానికి జిల్లాల వారిగా ఇన్ చార్జిలను నియమించడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు రెమిడిసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, అక్సిజన్ కు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదనీ కరోనా సోకిన వారికి పడకల విషయంలో, మందుల విషయంలో ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తుందని ప్రజలను కోవిడ్ బారినుండి కాపాడటానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
కేసిఆర్ ప్రకటనకు ముందుగా వైఎస్ షర్మిల కేసిఆర్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ వ్యాక్సినేషన్ విషయంలో సూచన చేశారు. తెలంగాణలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని అన్నారు. కాంట్రాక్టర్ లకు వేల కోట్లు అప్పనంగా అప్పజెప్పగా లేనిది ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా అని షర్మిల ప్రశ్నించారు. ఈ ప్రకటన ఆయన దృష్టికి వెళ్లిందో లేదో కానీ కెసిఆర్ రాష్ట్రంలోని అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాలకు అవసమైన వ్యాక్సిన్ డోస్ లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద భారం తగ్గుతుంది.