Corporate Hospitals Scams: ప్రభుత్వం ఓ పక్క కరోనా బాధితుల పట్ల కార్పోరేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహించి వైద్యసేవలు అందించాలని కోరుతోంది. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి బాధితుల నుండి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. మరో పక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు దోపిడీకి, అక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రెమిడసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.
కరోనా బాధితుల భయాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించాల్సి పేషంట్స్ వద్ద నుండి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పలు ప్రైవేటు ఆసుపత్రుల అక్రమాల బాగోతం వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల నిర్వహకులు కటకటాల పాలు అవుతున్నారు.
పలు కార్పోరేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని 13 ఆసుపత్రులను తనిఖీ చేశారు. వీటిలో 9 ఆసుపత్రుల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఏడుగురుని అరెస్టు చేశారు.
విశాఖపట్నం ఆదిత్య హాస్పటల్, కాకినాడలోని ఇనోదయ హాస్పిటల్, కేర్ ఎమర్జెన్సీ ఆసుపత్రులకు కోవిడ్ రోగులకు ట్రీట్మెంట్ కు అనుమతులు లేకపోయినా పేషంట్స్ ను చేర్చుకుని వైద్యం అందిస్తూ ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న పలు కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందించకపోవడం, అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు, ఇంజక్షన్ లు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు చేయడం లాంటివి అధికారులు గుర్తించారు. ఈ ఆసుపత్రుల నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.