Suicide: తిరుపతిలోని పద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ఓ మహిళా పేషంట్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. వార్డులోనే జయమ్మ అనే కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆసుపత్రి వద్ద బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందకే రోగులు మృతి చెందుతున్నారని ఆరోపిస్తున్నారు.
కోవిడ్ ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం, ఆహారం అందడం లేదంటూ పలువురు పేషంట్స్ వారి బంధువులకు చెబుతున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో తమ వాళ్లను చూడటానికి కూడా లోపలికి పంపించడం లేదంటూ పేషంట్స్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కరోనా బాధితులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విశాఖలో ఆసుపత్రి భవనం పై నుండి ఒకరు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే తిరుపతిలో అదే మాదిరి ఘటన వెలుగు చూసింది. అయితే విశాఖలో ఆసుపత్రి భవనంపై నుండి ఆత్మహత్య చేసుకోగా తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.