ఏపిలో రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి భిన్నంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయాన్ని ప్రభుత్వం, మంత్రులతో పాటు వివిధ అధికార, ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్నికల విధులను బహిష్కరిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయం నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరుగనున్నది. ఈ పరిణామాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈసీని సవాల్ చేసే అధికారం సీఎంకు లేదని నారాయణ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కూడా తప్పు బట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత కాదనే హక్కు ఎవరికీ ఉండదని అన్నారు. సీఎం జగన్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మొదటి నుండి విబేధాలు ఉన్నాయన్నారు నారాయణ. ప్రభుత్వం ఈసితో చర్చలు జరిపాలే కానీ ఘర్షణ పడకూడదని హితవు పలికారు. ఎన్నికల సంఘానికి ఎదురు చెప్పిన ప్రభుత్వాలను తాను ఇప్పటి వరకూ చూడలేదని నారాయణ అన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. విపక్షాలు ఎన్నికల సంఘం తీరును సమర్థిస్తుండగా, అధికార పక్షం ఎన్నికల సంఘాన్ని తూర్పారపడుతోంది. పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ హైకోర్టు కు చేరడంతో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ఫ్రోగ్రామ్ కూడా ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్నదని కేంద్ర ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల అంశం హాట్ టాపిక్ మారింది.