మెగా అభిమానుల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేయడంతో సీపీఐ నారాయణ వెనక్కు తగ్గారు. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు తెలిపారు. చిరంజీవిపై తాను తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు బాషాదోషంగా పరిగణించాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. తొలుత రాజమండ్రిలో, తరువాత విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు కొంత మంది బాధ, మరి కొంత మందికి ఆవేశం కల్గించిందనీ, వారి బాధను తాను అర్ధం చేసుకోగలనన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అవిలేకుండా రాజకీయాలు ఉండవని అన్నారు. ఆ ప్రకారం తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి మాట్లాడిన దాన్ని భాషా దోషంగా పరిగణించాలనీ, ఆ అంశాన్ని ఇంతటితో వదిలివేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.
భీమవరం లో జరిగిన అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి ఇటీవల సీపీఐ నారాయణ మాట్లాడుతూ ఈ వేడుకలకు చిల్లర బేరగాడు చిరంజీవిని ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన కృష్ణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఊసరవెల్లి చిరంజీవిని ఎందుకు వేదికపైకి పిలిచారని నారాయణ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నాగబాబు సీరియస్ గా స్పందించి ట్విట్టర్ వేదికగా నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కొంత మంది చేసిన తెలివితక్కువ .. వెర్రి వ్యాఖ్యలపై జనసైనికులు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్లకి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే .. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరూ వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి .. కాస్త అన్నం పెట్టండి.. తద్వారా ఆతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన నారాయణకు జనసేన కార్యకర్తలు, చిరు అభిమానుల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. పలువురు అభిమానులు నారాయణను అసభ్య పదజాలంతో దూషించారు. మరో పక్క గుంటూరు జిల్లాలో పోలీస్ స్టేషన్ లో నారాయణపై చిరు అభిమానులు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మీడియా తో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నాననీ, చిరు కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధం కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చిన నారాయణ .. క్షమాపణలు చెబుతున్నట్లుగా ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో చిరంజీవి సోదరుడు నాగబాబు శాంతించారు. మెగా అబిమానులకు, జనసేన కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేశారు. నారాయణపై సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్స్ ను ఆపేయాలని నాగబాబు కోరారు. తప్పు ఎవరు చేసినా క్షమాపణలు చెబితే వదిలేయాలన్నారు. ఇది మెగా, జనసేనికుల ధర్మమని పేర్కొన్నారు. నారాయణ పెద్ద వయస్సును దృష్టిలో పెట్టుకుని ట్రోల్ చేయడం మానుకోవాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?