CPI Narayana: సినిమా టికెట్ల ధరల అంశంలో ఏపి ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గత కొద్ది రోజులుగా పెద్ద వివాదమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఫిలిమ్ ఛాంబర్ నుండి కొన్ని ప్రతిపాదనలు కమిటికి అందాయి. ఇప్పటికే రెండు మీటింగ్ లు జరిగినా టికెట్ ధరల విషయంలో ఓ నిర్ణయానికి రాలేదు. మరో పక్క ఇటు వైసీపీ ప్రజా ప్రతినిధులు, అటు సినీ పరిశ్రమకు చెందిన వారి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో సినీ పరిశ్రమ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించి చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు ఉండగా ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించకుండా కేవలం చిరంజీవి ఒక్కరినే ఆహ్వానించడం, చిరంజీవి కూడా జగన్ ఆహ్వానానికి ముగ్దుడై వెంటనే ప్రత్యేక విమానంలో వచ్చి సీఎం జగన్ తో భేటీ కావడం ఓ పక్క రాజకీయ వర్గాల్లో, మరో పక్క సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
చిరంజీవి చొరవ తీసుకోవడంలో తప్పులేదు కానీ..
సినీ పరిశ్రమలో కళామతల్లి బిడ్డలం అంతా ఒక్కటే అని చెప్పుకుంటున్నా అందులో ఉన్న విభేదాలు సాధారణ రాజకీయాల కంటే ఎక్కువేననీ ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రుజువు చేశాయి. సినీ పరిశ్రమలో దివంగత దాసరి నారాయణరావు తరువాత ఆ స్థాయి వ్యక్తి ఎవరూ లేరని అందరూ అంటూనే ఉంటారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఏకనాయకత్వం కింద లేదు. సమస్య పరిష్కారానికి చిరంజీవి చొరవ తీసుకోవడంలో తప్పులేదు. అయితే సీఎం జగన్మోహనరెడ్డి ఆహ్వానించినప్పుడే తనతో పాటు సినీ పరిశ్రమ నుండి మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, దిల్ రాజు తదితర ప్రతినిధులం వస్తాం, ఇది తన వ్యక్తిగత సమస్య కాదు. మొత్తం పరిశ్రమకు సంబంధించింది అని చిరంజీవీ చెప్పి ఉంటే పరిశ్రమలో ఆయన గౌరవం ఇంకా పెరిగేది. లేదా ఫిలిమ్ ఛాంబర్ ప్రతినిధులను వెంట తీసుకువెళ్లి ఉంటే వాళ్లు సంతోషపడేవారు.
CPI Narayana: చట్టబద్దంగా ఎన్నికైన అసోసియేషన్ ఉండగా..
కేవలం చిరంజీవికే సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చి భేటీ కావడంపై సీపీఐ జాతీయ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. చట్టబద్దంగా ఎన్నికైన అసోసియేషన్ ఉండగా వ్యక్తులతో చర్చించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సినీ రంగ సంక్షోభానికి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతకు ముందు వర్మను, తాజాగా చిరంజీవితో మాట్లాడారన్నారు. ఇటీవల ఓ అసోసియేషన్ చట్టబద్దంగా ఎన్నికైందనీ, అలాంటి వాళ్లను పిలిచి మాట్లాడకుండా కేవలం ప్రచారంంలో ఉండటానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనీ, సమస్య పరిష్కారానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు నారాయణ.
ఒక వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు సినిమా వాళ్లను బూతులు తిడుతున్నారు. దాంతో సినిమా వాళ్లు కూడా స్పందిస్తున్నారు. సీఎం మాత్రం కొందరిని పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ ద్వంద ప్రమాణాలు ఏమిటని ప్రశ్నించారు. అసలైన వాళ్లతో చర్చించకుండా ఆ అసోసియేషన్ కు సంబంధం లేని వాళ్లతో మాట్లాడతారా అని అన్నారు. ఇటీవల ఉద్యోగుల సమస్యను పరిష్కారం చేశారు కదా..? ఇది కూడా అలాగే పరిష్కారం చేయండి, అంతే తప్ప సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు అని నారాయణ సూచించారు.