CPI Narayana: ఇటీవల దేశ వ్యాప్తంగా రాజద్రోహం సెక్షన్ 124 (ఏ)పై విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్ల కింద నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్ లపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపినప్పటికీ చివరకు కోర్టుల్లో ఈ కేసులు నిలబడలేదు. ఎక్కువ సందర్భాల్లో ఈ సెక్షన్ కింద నమోదు అయ్యే కేసులు కోర్టుల్లో నిరూపితం కావని తెలిసినప్పటికీ పాలకులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేయడం జరుగుతుంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు కావడం వల్ల తరువాత కేసు సంగతి ఎలా ఉన్నా ముందు నిందితుడు కొద్ది రోజులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
గతంలో ఏపితో సహా పలు రాష్ట్రాల్లో రాజద్రోహం సెక్షన్ కింద కేసులు నమోదు అయినప్పటికీ పెద్దగా దీనిపై దేశ వ్యాప్త చర్చ జరగలేదు. కానీ ఇటీవల ఏపిలో వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు పై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో పాటు రెండు మీడియా సంస్థలపైనా నమోదు చేయడం, సదరు మీడియా సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రాజద్రోహం సెక్షన్ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు కూడా ఆ చట్టంపైనే సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం పట్ల ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజద్రోహం సెక్షన్ పై గతంలో పలు మార్లు అరెస్టు అయిన సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: AP High Court: అమూల్ కు ఏపి హైకోర్టు నోటీసులు..ప్రభుత్వానికి మరో షాక్..!!
ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై విమర్శలు చేసే వారిపై, ప్రజా పోరాటాలు నిర్వహించే ప్రతిపక్షాలు, వామపక్ష మేధావులపై అక్రమంగా బనాయిస్తున్న రాజద్రోహం చట్టం (124 ఏ) ను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులను అణచివేయడానికి ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజా ఉద్యమాల సందర్భంగా తనపై మూడు సార్లు ఈ చట్టాన్ని ప్రయోగించారని నారాయణ గుర్తు చేశారు. తమకు నచ్చని వారితో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ స్తంభంగా ఉంటున్న మీడియాపైనా ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడం ఆందోళనకరమన్నారు. పాలన వైఫల్యాలపై ప్రతిపక్షాలు, మేధావుల విమర్శలు సహజమని, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాలం చెల్లిన చట్టాలపై పార్లమెంట్ లో చర్చించి రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.