Cradle Ceremony: ఇటీవల కాలంలో పెంపుడు జంతువులకు వివిధ రకాల వేడుకలు నిర్వహించడం ఫేషన్ గా మారింది. గతంలో ఇటువంటి వాటిని విడ్డూరం అనే వాళ్లు కానీ నేడు వేడుకగా పెంపుడు జంతువులకు జన్మదిన వేడుకలను నిర్వహించి వాటిపై వారికి ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి పార్టీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో ఓ రైతు తన పెంపుడు శునకానికి ఘనంగా బర్త్ డే వేడుకను నిర్వహించడం ఆ గ్రామంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం (బందరు)లో ఓ రైతు కుటుంబం తమ లేగ దూడకు ఘనంగా బారసాల నిర్వహించి దానిపై తమ ప్రేమను చాటుకున్నారు.
Read More: AP CM YS Jagan: ఏపిలో నూతన విద్యావిధానంపై సీఎం జగన్ సమీక్ష..! కీ పాయింట్స్ ఇవే..!!
బందరు బీచ్ రోడ్డులోని డాబాల సెంటర్ లో నివాసం ఉండే ఓ రైతు కుటుంబంలోని ఆవుకు గత నెల 6వ తేదీన ఆడ దూడ జన్మించింది. దీంతో వారు చాలా సంతోషించారు. ఆ లేగ దూడకు తాజాగా బార సాల నిర్వహించారు. అదీ సంప్రదాయ బద్దంగా నిర్వహించడం గమనార్హం. లేగ దూడకు బంగారం అని పేరు పెట్టారు. తమ నివాసంలో ఉయ్యాల కట్టి పూలతో అలంకరించారు. ఉయ్యాలలో దూడను ఉంచి హారతులు పట్టి, పాటలు పాడారు. గోపూజ నిర్వహించి ముత్తైదువులకు వాయినాలు సమర్పించుకున్నారు.
బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని పిలిచి భోజనాలు ఏర్పాటు చేశారు. వీరు వారి గోవు గర్భిణిగా ఉన్న సమయంలో సీమంతం కూడా చేశారుట. ఇంతకు ముందు పట్టణాల్లో ఖరీదైన ఆల్ సేషన్ డాగ్స్ పెంచుకునే ధనవంతులు వారి ఇళ్లల్లో నిరాడంబరంగా వాటి బర్త్ డే వేడుకలను జరుపుకునే వారు. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ వారు ఆప్యాయంగా పెంచుకునే మూగ జీవాలకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండటం నయా ట్రెండ్ అయ్యింది.