Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులకు పోలీసులూ రక్షణ కల్పించలేకపోయారు. రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి మొరపెట్టుకున్న తరువాత కూడా వారికి భంగపాటే ఎదురైంది. నవ వరుడిపై దాడి చేసి వధువును ఆమె బంధువులు కిడ్నాప్ చేశారు. యువతి కిడ్నాప్ అయి రెండు రోజులు గుడుస్తున్నాఆమె ఆచూకి లభించలేదు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర సంచలనం అయ్యింది.
విషయంలోకి వెళితే..ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడుకు చెందిన శెట్టి చైతన్య (26) సమీపంలోని బేతపూడి గ్రామానికి చెందిన ముస్లిం యువతి కౌసర్ (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి మతాలు వేరు కావడంతో పెద్దలు వివాహానికి అంగీకరించరని ఇంటి నుండి వెళ్లిపోయి గుంటూరులోని శేషాచల ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరు తమకు పెద్దల నుండి రక్షణ కల్పించాలంటూ నేరుగా జిల్లా ఎస్పీని కలిసి కోరడంతో ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఫిరంగిపురం పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి ఎలాంటి హాని తలపెట్టమని వారి బంధువులు పోలీసు స్టేషన్ లో హామీ ఇచ్చారు. దీంతో ఈ నవ దంపతులు తమకు ఏ భయం లేదనుకుని ఆటో ఎక్కి ఇంటికి వెళుతుండగా యువతి బంధువులు రోడ్డుపై ఆటోను నిలవరించి నవ వరుడుపై దాడి చేశారు. వధువుని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పరారయ్యారు. వెంటనే వరుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఘటనా ప్రదేశానికి వెళ్లి పోలీసులు పరిశీలన చేశారు. యువతి కిడ్నాప్ దృశ్యాలు అక్కడి సమీపంలోని సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా యువతి ఆచూకి లభించకపోవడంతో యువకుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానిక పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. స్వయంగా జిల్లా ఎస్పీ చెప్పిన తరువాత కూడా నవ దంపతులకు రక్షణ కల్పించడంలో విఫలం అవ్వడంతో వారు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. యువతి బంధువులు ఆమెను ఎక్కడైనా దాచారా లేక ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క తన భార్యను అప్పగించకేంటే స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు హెచ్చరిస్తున్నాడు.