Crime News: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తిని సజీవ దహనం చేసి నేరానికి ఇన్స్స్టాంట్ శిక్ష వేసేశారు ఆ గ్రామస్తులు. ఘటనపై పోలీసు కేసు పెట్టడం, కోర్టు చుట్టూ తిరగడం, నేరస్తుడు బెయిల్ పై బయటకు రావడం, సంవత్సరాల తరబడి కేసు నడవటం, అప్పటికీ సాక్షాలు లేవన్న కారణంతో నేరస్తుడికి శిక్ష పడుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంటుందనుకున్నారో ఏమో, గ్రామంలో అత్యాచర ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడికి దేహ శుద్ధి చేసి చెట్టుకు కట్టేసి తగులబెట్టేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం అప్పగానిపల్లె గ్రామంలో జరిగింది.
విషయంలోకి వెళితే…గ్రామానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి పనిపాట లేకుండా తిరుగుతూ పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో గ్రామం విడిచి వెళ్లాలంటూ గ్రామస్తులు తెలిపినా గ్రామంలోనే ఉంటున్నాడు. తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడంతో పాటు ఆమె వంటిపై నగలు, రూ.4వేల నగదు తీసుకుని పరారు అవుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన యువకులు ఊరి చివర చెట్టుకు కట్టేసి దేహ శుద్ధి చేసి నిప్పు అంటించారు. దీంతో అతన సజీవ దహనం అయ్యాడు. బాధితురాలిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.