Crime News: మహిళలు, బాలికల రక్షణ కోసం పాలకులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా..మృగాళ్లకు అవి ఏమీ తెలియడం లేదు.. లైంగిక వేధింపులు, అత్యాచార్యాలు జరుగుతునే ఉన్నాయి. లైంగిక వేధింపులకు గురవుతున్న యువకులు కొందరు మాత్రమే ధైర్యంతో పోలీసు స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్కువ శాతం పరువు కోసం, ఫిర్యాదు ఇస్తే పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనో, లేక నిందితుడితో ప్రాణ హాని భయంతోనో ధైర్యం చేసి ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. యువతులను రహస్యంగా వీడియోలు తీయడం, ఆ తరువాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం, లైంగికదాడి చేయడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ దిశ చట్టాన్ని తీసుకువచ్చినా అది ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఈ తరహా నేరాలకు పాల్పడిన వారి విషయంలో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించినట్లైయితే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దిశగా ఆలోచించే జగన్మోహనరెడ్డి సర్కార్ దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఒక యువతిని ఎస్ఐ పిలుస్తున్నారంటూ యువకుడు ఆమెను బైక్ పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తొలుత ఆ యువతి స్నేహితులతో కలిసి రోడ్డుపై వెళుతుండగా అనుసరించిన దుండగుడు కొంత దూరం వెళ్లిన తరువాత ఆమెను ఒంటరిగా తీసుకువెళ్లి బెదిరించాడు. “నీకు సంబంధించిన వీడియోలు నా వద్ద ఉన్నాయి, మీ పెద్ద వాళ్లకు అవి చూపిస్తా” అంటూ ముందు బెదిరించాడు. దానికి ఆ యువతి “తాను ఏమి తప్పు చేయలేదు” అని సమాధానం ఇవ్వడంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి మాట మార్చి ఎస్ఐ గారు స్టేషన్ కు తీసుకురమ్మన్నారు. బైక్ ఎక్కు అంటూ ఎక్కించుకుని కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకువెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను రూమ్ వద్ద దింపేసి వెళ్లిపోయాడు.
ఈ విషయాన్ని ఆ యువతి స్నేహితులకు చెప్పి రోధించగా వారు ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ఒప్పించారు. బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్ కు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన దిశ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ యువకుడు గతంలోనూ ఇటువంటి నేరాలు ఏమైనా చేశాడా అన్న దిశగా కూడా విచారణ జరుపుతున్నారు.