Crime: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాస్కులు ధరించని వ్యక్తులపై జరిమానాలు, కేసులు కూడా నమోదు చేస్తున్నారు. మాస్కులు ధరించని వ్యక్తుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల మాస్కు ధరించలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి వచ్చింది. అతని చేతికి, కాలికి మేకులు దించారని ఆమె తల్లి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బరేలీలోని బరాదరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మే 24 రాత్రి 10 గంటల ప్రాంతంలో తమ ఇంటి వద్ద ఉండగా ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి మాస్కు ధరించలేదని తమ కుమారుడి పట్ల దురుసుగా ప్రవర్తించి తీసుకువెళ్లారని ఆమె తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అడిగితే తన కుమారుడిని అరెస్టు చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించింది. మరుసటి రోజు వేకువజామున తీవ్ర గాయాలతో తన కుమారుడు కనిపించాడనీ, చేతికి కాలికి మేకులు కొట్టి ఉన్నాయని పేర్కొంది. బుధవారం ఆమె పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని వేడుకుంది. చేతికి, కాళ్లకు మేకులు దిగిన ఫోటోలతో ఆ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ ఆ ఫోటోలతో వార్త వైరల్ కావడంతో ఎస్పీ రోహిత్ సజ్వాన్ స్పందించి వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయని, ఆ కేసుల నుండి తప్పించుకునేందుకే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.