AP Govt: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎన్నో వ్యాఖ్యలు.. ఎందరో అనలైజ్ చేస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నా సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారని.. ఎఫ్ఆర్ఎంబీ లిమిట్ దాటిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వం అప్పులు చేస్తున్నామంటూనే.. పరిస్థితి అదుపులోనే ఉందని అంటోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా తమ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. బుగ్గన ప్రకటనపై పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. ఆర్ధిక మంత్రి ప్రకటన.. తమకు తామ ఆశీర్వదించుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్దిక పరిస్దితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆరోపణలు..
‘బుగ్గన చెప్పే లెక్కలు చూస్తే ఆర్దిక శాస్త్రం రాసిన చాణ్యుకుడు కూడ నివ్వెరపోతాడు. ఒక ప్రభుత్వాన్ని ఆర్థికంగా పతనం చేయోచ్చనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. ఒకసారి కరోనా ఉన్నా అద్బుతంగా చేశామని.. మరోసారి కరోనాతో ఆదాయం తగ్గింది అంటారు.. ఏది నిజం? నిజాలు చెబితే మీ తల వేయి ముక్కల అవుతుందనే మీకేదో శాపం ఉన్నట్టుంది. అందుకే.. అబద్దాలు చెబుతున్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత? చేస్తున్న మూల ధన వ్యయం ఎంత? సంక్షేమానికి ఖర్చు చేస్తున్నదెంత? జీతాల కోసం ఎంత ఖర్చు..? మీ దుబారాకు ఖర్చెంత..? కొన్ని పధకాలకు అయ్యే ఖర్చుకంటే ప్రకటనల ఖర్చే ఎక్కువగా ఉంటోందనేది నిజం కాదా..? వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాయ లెక్కలు చెప్పడానికి సిద్దమవుతున్నారు’ అని అన్నారు.
నిజానిజాలెంత..
టీడీపీ గత హయాంలో ఇప్పుడు పయ్యావుల ఉన్న పీఏసీ చైర్మన్ హోదాలోనే బుగ్గన ఉన్నారు. ప్రభుత్వ ఖర్చులు, రాబడి, వ్యయాలు.. ఆయనకు తెలుసు. టీడీపీ ప్రభుత్వాన్ని బుగ్గన ఇలానే విమర్శించారు. కానీ.. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలుకు బుగ్గన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రానికి సాయం చేయమని కోరుతూంటారని.. పయ్యావుల కేశవ్, ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ, బీజేపీ నుంచి సోము వీర్రాజు విమర్శిస్తూంటారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, అప్పులపై ప్రశ్నిస్తూనే ఉంటారు. నిప్పు లేనిదే పొగ రాదనే సామెతలా.. వీరంతా ఆరోపిస్తున్నట్టు రాష్ట్ర ఆర్ధికశాఖ పరిస్థితిపై నిజమేంటో.. బుగ్గనకే తెలియాలి.