మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (వివేకా) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడేళ్లు దాటింది. గత ప్రభుత్వ హయాంలో సిట్ దర్యాప్తు, ఆ తరువాత వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత మరో సిట్ దర్యాప్తు చేసినా అసలైన దోషులను పట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించి వివేకా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. రెండేళ్లుగా సీబీఐ విచారణ కొనసాగిస్తూనే ఉంది. వివేకా హత్య ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అయితే వివేకా హత్య కేసులో సూత్రదారులు ఎవరు అనేది తేల్చి అరెస్టు చేయడంలో సీబీఐ పురోగతి సాధించలేదు.
ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని సునీత తాను వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కడప జైలులో ఉన్న నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఇటీవలే హైకోర్టు తిరస్కరించింది. మరో పక్క ఈ కేసులో గతంలో బెయిల్ పొందిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇంకా విచారణకు రాలేదు. ఓ పక్క సీబీఐ, మరో పక్క వివేకా కుమార్తె సునీత పిటిషన్ లు దాఖలు చేయడంతో సుప్రీం చెంతకు వివేకా కేసు మరో సారి చేరింది.