Daggubati Purandeswari: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో పాలకులు స్వలాభం కోసం పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. సుపరిపాలన అందించడం లేదన్నారు. వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల కాలంలో ఆరులక్షల కోట్ల అప్పు చేసిందన్న ఆమె.. రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై లక్షా 20వేల అప్పు ఉందన్నారు.
Daggubati Purandeswari: కేంద్రం నిధులు ఇస్తే గానీ రాష్ట్రం పూట గడవని పరిస్థితి
కేంద్రం నిధులు ఇస్తే గానీ రాష్ట్రం పూట గడవని పరిస్థితి ఉందని పురందేశ్వరి విమర్శించారు. వైసీపీ సర్కార్ అభివృద్ధిని గాలికి వదిలి ఎక్కడ అప్పు దొరుకుతుందా అనే వెతుకులాటలో ఉందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు ఇస్తోందని చెప్పారు. అయినప్పటికీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని భూములను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని అన్నారు.
బీజేపీ సత్తా మరో సారి రుజువు
అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలతో బీజేపీ సత్తా ఎంటో మరో సారి రుజువు అయ్యిందన్నారు. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. ఏపిలోనూ ఇవే ఫలితాలు పునరావృత్తం అవుతాయని, ఆ దిశగా పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ నుండి వేలాది మంది భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. పాకిస్తాన్ విద్యార్ధులు కూడా క్షేమంగా బయటపడేందుకు భారత్ జెండా చేబూని వచ్చారంటే అది మన దేశ గొప్పతనమని పురందేశ్వరి పేర్కొన్నారు.