Dalita Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ఈ పథకం ఎన్నికల కోసమన్న టాక్ ఓ వైపు ఉంటే… మరోవైపు ఇతర వర్గాలు సైతం దళితబంధు వంటి పథకాలు ప్రవేశపెట్టాలన్న డిమాండ్ చేస్తున్నాయి. దళితబంధు మాదిరి బీసీ బంధు కూడా రాష్ట్రంలో అమలు చేయాలని లేకపోతే, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.
Read More: KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం మరో నిర్ణయం తీసుకున్న కేసీఆర్
దళితుల విషయం సంతోషకరమే…బీసీల సంగతి?
దళితులకు రూ.10 లక్షల రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. దళిత బంధును హుజురాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఇదే ఒరవడిలో బీసీ బంధు పథకం పెట్టి ప్రతీ బీసీ కుటుంబానికి రూ.10 లక్షల అందించాలన్నారు. బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయని తెలిపారు. బీసీబంధు పెట్టడంతో గొప్ప నాయకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారన్నారని అన్నారు. బీసీల వాటా బీసీలకు దక్కితే ప్రభుత్వానికి ఆ గౌరవం దక్కుతుందని సూచించారు.
Read More: KCR: కేసీఆర్కు ఏకు మేకు అవుతున్న దళితబంధు!
బీసీలు పోరాటం చేయాల్సిందే…
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలే ఉన్నారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. గత ఏడేండ్లుగా బీసీ కార్పొరేషన్ నుంచి గాని, కుల ఫెడరేషన్ నుంచి కానీ ఎలాంటి రుణాలు రాలేదన్నారు. ఐదు లక్షల 77 వేల దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ఒక్కొక్కరూ ఒక లక్ష నుంచి యాభై లక్షల వరకు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. బీసీబంధు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకుంటామని హెచ్చరించారు. కల్యాణ లక్ష్మి కూడా మొట్టమొదటగా దళితులకు, మైనార్టీలకు మాత్రమే ఇచ్చారని, అసెంబ్లీలో పోరాటం చేసి, ఇందిరాపార్కు వద్ద వేలాదిమందితో ధర్నా చేయడంతో కళ్యాణ లక్ష్మి బీసీలకు కూడా వర్తింపజేశారని గుర్తుచేశారు. ప్రతీ బీసీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వడం ప్రభుత్వానికి చాలా సులభం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 40 వేల కోట్ల మిగులు బడ్జెట్తో అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పాటు అయిందన్నారు. బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకూ విశ్రాంతి తీసుకోవద్దన్నారు. 52 శాతం ఉన్న బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, ఇది ప్రజాస్వామ్యానికి తలవంపు అన్నారు. తిరుగుబాటు చేసి మన వాటా మనం దక్కించుకోవాలి అని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో అఖిలపక్షంతో బీసీ బిల్లుకు కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు.