Telangana : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు కలవరపెడుతోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ సమయంలోనే తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్లు అందుబాటులోకి తెస్తోంది.
తెలంగాణలో ఇదీ పరిస్థితి…
తెలంగాణలో తాజాగా 1,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆరుగురు మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819కి చేరుకోగా.. 3,02,207 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం 6,900 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,712 మంది మృతిచెందారు.. మళ్లీ కేసులు పెరుగుతుండడంతో.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
సర్కారు కీలక నిర్ణయం…
కరోనా పంజా విసిరిన మొదటల్లో ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ అన్ని సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను మళ్లీ ప్రారంభం కానున్నాయి.. ఇక, హైదరాబాద్లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్ను పరిశీలించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏపీలో ఇది పరిస్థితి….
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఉధృతితో రోజువారి కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1398 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక కరోనాతో మరో 9 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనాతో ప్పటివరకు 7వేల 234 మంది మృత్యువాడపడ్డారు.