కోట్లాది రూపాయల విలువ కల్గిన విశాఖ దసపల్లా భూములకు సంబంధించిన వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ భూముల అభివృద్ధి అగ్రిమెంట్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాత్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం, టీడీపీ అనుకూల మీడియాలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కథనాలు వస్తుండటంతో సదరు ఆరోపణలపై భూయజమానులు, బిల్డర్లు స్పందించి క్లారిటీ ఇచ్చారు. దసపల్లా భూ లావాదేవీలతో విజయసాయిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కడి ప్లాట్ల యజమానులు దసపల్లా రాఘవేంద్రరావు, దసపల్లా కోటేశ్వరరావు, కంకటాల మల్లిక్, బాలాజీ, సుబ్బరాజు, డెవలపర్స్ ఉమేష్, గోపీనాథ్రెడ్డి తదితరులు వివరణ ఇచ్చారు. దసపల్లా భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయాలతో వాటిని ముడిపెట్టొద్దని సూచించారు. ఆ భూముల్లో కొన్ని 22/ఏలో ఉన్నప్పటికీ తాము న్యాయస్థానాలను ఆశ్రయించామని తెలిపారు. త్వరలో గ్రీన్ సిగ్నల్ వస్తుందని, యూఎల్సీకి సంబంధించి కూడా పెండింగ్ లో ఉంటే తాము న్యాయపరంగా పోరాడుతున్నామని చెప్పారు. సర్వే నంబర్లు, రాణి కమలాదేవీ నుంచి తీసుకున్న సంతకాలు, భూ యజమానులు, డెవలెపర్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ప్రకటన కాపీని ఈ సందర్భంలో విడుదల చేశారు. సర్క్యూట్ హౌస్కు సంబంధించి గతంలోనే పరిహారం చెల్లించేశారన్నారు. అక్కడ ఉన్న వాటర్ ట్యాంకులు, ఇతరత్రా విషయంలో న్యాయపరమైన చిక్కుల్లేకుండా అందరితోనూ సంప్రదింపులు జరిపామనీ, ఆ సమస్యలు కూడా త్వరలో తీరిపోతాయని వారు తెలిపారు.
గతంలోనే ఒప్పందాలు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయా భూ యజమానులతో సంప్రదింపులు జరిపి అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని డెవలపర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉమేష్ తెలిపారు. నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్న కారణంతోనే వాటాలు వేసుకున్నామని ఆయన తెలిపారు. ఒకేసారి పెద్దపెద్ద అపార్ట్మెంట్లు నిర్మించే సమయంలో బ్లాస్టింగ్ వంటివి చేయాల్సి వస్తుందన్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతూ ఉంటుంది. వాటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే డీజీపీఏ సమయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఉమేష్ వివరించారు. ఎంపీ విజయసాయితో తనకు 1996 నుంచి తనకు పరిచయం ఉందని ఉమేష్ తెలిపారు. కరోనా సమయంలో ప్రగతి భారత్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించామని, అప్పుడే వ్యాపారి గోపీనాథ్రెడ్డి పరిచయం అయ్యారని చెప్పారు. ఆయనను డైరెక్టర్గా పెట్టి అస్యూర్ ఎల్ఎల్పీ ప్రారంభించామని చెప్పిన ఉమేష్.. తమ వ్యాపారాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
65 మంది యజమానులు సంతోషంగా ఉన్నారు
దాదాపు 22 సంవత్సరాలుగా ఇబ్బందులు, ఇబ్బందులు పడ్డామనీ, ఇప్పుడిప్పుడే చిక్కుముడులు వీడుతుండటంతో 65 మంది యజమానులు సంతోషంగా ఉన్నారని ఓ ఫ్లాట్ యజమాని కంకటాల మల్లిక్ తెలిపారు. వాటాల విషయంలో 33 శాతం వరకు తమకు వస్తాయనీ, అవన్నీ రికార్డెడ్గానే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వంతో ఉన్న చిక్కుముడులు, భవన నిర్మాణాల విషయంలో తాము ఇబ్బందులు పడలేక, ఎవరికైనా థర్డ్పార్టీకి డీల్ అప్పగిస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ ఎల్ఎల్పీతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని జాస్తి బాలాజీ అనే యజమాని తెలిపారు. గజం స్థలంకు 12అడుగుల నిర్మాణం ఇచ్చేలా అంతా మాట్లాడుకున్న తర్వాతే సంతకాలు చేశామని తెలిపారు. చాలా మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కారణంగా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ లు ఆలస్యం అయ్యాయని చెప్పారు.
విశాఖలో పరిపాలనా రాజధాని మద్దతుగా.. సీఎం జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టిన మంత్రి ధర్మాన