Ys Jagan: ఏపిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయం తెరలేచింది. బీజేపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. గత రెండున్నరేళ్లుగా ఎప్పుడూ లేకుండా ఈ వారం రోజుల్లోనే కేంద్రంలోని బీజేపీపై అధికార వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నుండి బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో వైసీపీ ఉందనీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ రెండున్నరేళ్లు కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.
ఏపి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో గానీ, విభజన చట్టం హామీలను అమలు చేయడంలో గానీ మరే ఇతర అంశాలలోనూ కేంద్రంలోని బీజేపీ సహకరించకుండా ఏవో కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ రాజసభలో వైసీపీని వాడుకుంటూ బీజేపీ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఎందుకో గానీ గత వారం రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారానికి వైసీపీ అంకురార్పణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుంది, జగన్ ను అరెస్టు చేయాలని చూస్తుంది అంటూ వైసీపీ నేతలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అయితే దీనిపై బీజేపీ మాత్రం జగన్మోహనరెడ్డి చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. విపరీతంగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దయనీయంగా చేశారు, జగన్ బెయిల్ రద్దు అయితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని సీయం చేయాలని వైసీపీలోనే కొంత గేమ్ నడుస్తోంది. దీనిలో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదు అని వాదిస్తున్నది. ఇక్కడ గమించాల్సిన ఏమిటంటే బీజేపీ, వైసీపీ మధ్య వైరం ఉందో లేదో తెలియదు గానీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, రాష్ట్రంలోని ప్రధాన అంశాలను మరుగుపర్చడానికి ఈ రకమైన రాజకీయానికి తెరతీశారనే మాట వినబడుతోంది.
ఇదిలా ఉంటే మరో విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే వైసీపీతో స్నేహం మంచిది కాదు, వైసీపీని టార్గెట్ చేయాల్సిందేనని అంతర్గత సర్వే ద్వారా వెల్లడైందని అందుకే ఈ కొత్త రాజకీయం మొదలు అయ్యింది అని కూడా అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. మహిళా ఓటర్ల విషయానికి వస్తే 60 నుండి 70 శాతం వైసీపీ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉండగా, అర్బన్ ఓటర్లు, విద్యాధికులు, ఉపాధ్యాయులు, ఎంప్లాయిస్ లలో కొంత శాతం మంది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేంద్రంలోని బీజేపీ గానీ, పలు మీడియా సంస్థలు గానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వస్తున్నది అని తేలిందని సమాచారం. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్న 151 స్థానాల్లో 60 స్థానాలు కోల్పోతుంది అని వెల్లడి అయ్యిందట. జగన్మోహనరెడ్డిపై ఈ రెండేళ్లలోనే వ్యతిరేకత వచ్చిందనీ ఈ పరిస్థితుల్లో వైసీపీకి వ్యతిరేకంగా నడిస్తే బీజేపీకి రాష్ట్రంలో మేలు జరుగుతుందని భావిస్తుందట. వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుందట. అయితే ఈ ప్రచారాలు మాత్రం కరెక్టు కాదనే మాట కూడా వినబడుతోంది. రాష్ట్రంలో కీలకమైన విషయాలైన ధరల పెరుగుదల, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య, వివేకా హత్య కేసు, పెట్రోల్ ధరల పెంపు, రాష్ట్రం అప్పుల గోల తదితర విషయాలను డైవర్ట్ చేసేందుకే బీజేపీ, వైసీపీ దొంగాట ఆడుతున్నాయని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.