ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తనదైన డైనమిజంతో రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న వైఎస్ఆర్సీపీ రథసారథి పరిపాలనలో మాత్రం కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? అనే చర్చ వినిపిస్తోంది.
ఏపీలోని పలు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా రామతీర్థం ఘటనతో రాజకీయ పార్టీలతో రణరంగంగా మారింది. ఇదే సమయంలో జగన్ తీరు చర్చకు తెరలేపుతోంది.
ఒక్క దోషి ని కూడా పట్టుకోలేదు
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పూర్తిగా దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపైనే నడుస్తున్నాయి. ఒకేరోజు మూడు పార్టీల నేతలు … రామతీర్థంలో పర్యటించడంతో… ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే. రామతీర్థంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డిల పర్యటనతో ఏపీ రాజకీయాలు ఇంకా వేడేక్కాయి. ఇదే అదునుగా తీసుకుని వైసీపీ, టీడీపీ పార్టీలపై బీజేపీ ఎదురుదాడులు చేస్తోంది. రాష్ట్రంలో హిందూ ఆలయాల పై దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్ మండిపడ్డారు. విజయవాడ లో సీతాదేవి విగ్రహం కూల్చిన ఘటన బాధాకరమని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక 150 వరకు ఘటనలు వరుసగా జరిగాయని, వీటిని నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కనీసం సంఘటన జరిగిన ప్రదేశాలను కూడా మంత్రులు పరిశీలించడం లేదని, ఆయన అన్నారు. సిఎం మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి అని అయన ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? రాష్ట్రం లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంటే ఏం చేస్తున్నారు అని అయన ప్రశ్నించారు. ఒక్క కేసులో అయినా దోషులను పట్టుకోలేక పోయారన్నారు.
ఈ ఒక్క పని చేస్తే ….
మరోవైపు ఏపీలో జరుగుతున్న ఘటనలపై టాలీవుడ్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యకూడదని… నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందేనని నటుడు సుమన్ స్పష్టం చేశారు. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం బాధాకరమని… ఆలయాల్లో సీసీ కెమెరాలతోపాటు భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. జగన్కు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని అనుమానాలు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. కాగా, సినీ నటుడు సుమన్ సూచించినట్లు సీసీ కెమెరాలు సరైన పరిష్కారం అని పలువురు అంటున్నారు. మరోవైపు సీఎం జగన్ కఠిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏపీ బీజేపీ ఇంచార్జీ అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు చాన్స్ ఇచ్చినట్లు అవుతుందని విశ్లేషిస్తున్నారు.