YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విపక్షాలు అక్కడ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ ప్రజలకు లేఖలు రాశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆయన రాసిన లేఖల ప్రతులు పంపనున్నారని తెలుస్తోంది.
జగన్ కొత్త ట్రెండ్….
ఈనెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొననున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఇదే సమయంలో సీఎం జగన్ ప్రజలకు లేఖ రాయనున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు చెబుతున్నారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖ పై జగన్ సంతకం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని లేఖలో జగన్ అభ్యర్ధించారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను లేఖలో జగన్ ప్రస్తావించారు. ఈ లేఖలను లబ్ధిదారులకు వైసీపీ నేతలు అందించనున్నట్టు చెబుతున్నారు.
రెండేళ్ల తర్వాత…
తిరుపతిలో తాజా పరిణామాలతో ఏపీ సీఎం జగన్ ప్రచారానికి రావాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సీఎం జగన్ తిరుపతి వస్తే దాదాపు రెండేళ్ల తర్వాత ప్రచారంలో పాల్గొన్నట్లు అవుతుంది. 2019 ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలే గెలుపు బాధ్యత తీసుకున్నారు. అయితే తాజాగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళితే అక్కడ ప్రచారంలో మరింత హీట్ పెరగడం ఖాయమని పలువురు అంటున్నారు.