YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా? ఏపీ సీఎం కు మేలు చేసే నిర్ణయాన్ని అంత తొందరగా వెలువరించకుండా ఉందా? ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వైఖరి ఏంటి? ఇప్పుడు ఈ చర్చ ఏపీలో హాట్ టాపిక్. ఇదంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించే! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది. దీనిపై రాజకీయ… కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. అమ్మకం నిర్ణయం తిప్పికొట్టేందుకు ఆందోళనలకు దిగుతున్నాయి. ఈ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
YS Jagan : విశాఖలో ఆందోళనలు..
`సేవ్ స్టీల్ ప్లాంట్` పేరుతో మహా ధర్నా చేపట్టిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా కోసం వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ప్రాణాలు ఇచ్చయినా స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని చెబుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి నిరాహారదీక్షలు, రాజీనామాలకు వెనుకాడబోమని ఎంపీలు ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యేలను అడ్డగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
వైసీపీ ఏం చేస్తోంది ?
ఏపీ ప్రజల మనోభావాలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అధికార వైసీపీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా ఎంపీల రాజీనామా వరకూ ఈ ప్రతిపాదన చేరింది. అదే సమయంలో కేంద్రం నుంచి ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు . మరోవైపు ఎంపీలు కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే సమాచారం రాలేదని సమాచారం. ఈ విషయాన్నే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీలు కేంద్రం స్పందన వచ్చిన తర్వాతే తమ పార్టీ వైఖరి వెల్లడించనున్నట్లు తెలిపారు. కేంద్రం ఏపీ సీఎం జగన్ ఓపికను పరీక్షిస్తోందా? అనే టాక్ తెరమీదకు వస్తోంది. అయితే , కేంద్ర తన వైఖరి వెల్లడించకపోవడం మాత్రం వైసీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.