YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఉత్కంఠకు తెరదించుతూ, కొత్త పార్టీ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్య పాలన అవసరం ఉందని వైఎస్ షర్మిల ప్రకటించారు. కొత్త పార్టీ గురించి ఆమె లోటస్పాండ్లో మాట్లాడుతూ… అన్ని జిల్లాల నేతల అభిప్రాయం తీసుకుంటున్నానని..సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తానన్నారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ షర్మిల రాజకీయ ఎంట్రీ గురించి ఎలాంటి అంచనాలతో ఉన్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
YS Sharmila షర్మిల ఏం చెప్పారు ?
తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని రాజన్మ రాజ్యమే తమ నినాదమని ఆమె ప్రకటించారు. నల్గొండ జిల్లా నాయకుల అభిప్రాయం తీసుకున్నట్లు చెప్పిన షర్మిల జిల్లా నేతల నుంచి మంచి స్పందన వచ్చిందని.. రాబోయే సమావేశాలు జిల్లాలోనే ఉంటాయన్నారు. నల్గొండ ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని తెలిపిన షర్మిల.. జగన్మోహన్ రెడ్డి నేను వేరు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పని ఆయనది తన పని తనది అన్నారు. పాదయాత్రపై స్పందించని వైఎస్ షర్మిల..పార్టీ పెట్టడంపై, త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానన్నారు.
కేసీఆర్ కు క్లారిటీ ఉందా?
టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణలో కొత్త పార్టీ అనే విషయం మీద కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని అన్నారు. పార్టీ అంటే పాటలు పాడటం.. పాన్ షాప్ పెట్టడం కాదంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలంటే దానికి బలమైన నిర్మాణం కావాలని పార్టీ ముందుకెళ్లడానికి తగిన వ్యూహం కూడా ఉండాలన్నారు.
అంతే కాక గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయిన సంగతిని కూడా కేసీఆర్ సమావేశంలో పేర్కొన్నారు. దేవేందర్గౌడ్, విజయ శాంతి, చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ, కోదండరాం లాంటి వాళ్లు పార్టీలు పెట్టినా.. వాటి ఆనవాళ్లు లేవన్నారు. చెన్నారెడ్డి లాంటి నేత తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచినా.. ఇందిరాగాంధీ ధాటికి తట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీ ఆర్ వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది షర్మిల పార్టీ గురించేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, షర్మిల తన రాజకీయ రీ ఎంట్రీ గురించి అధికారికంగా చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.