Venkaiahnaidu : రాజకీయాల్లో ఎవరు జెండాలు వారికుంటాయి. ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. ఇక్కడ వ్యక్తిగత ఎజెండ వేరు పార్టీ జెండా వేరు. ఒక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తే కచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను సైతం ప్రచారం చేయాల్సి ఉంటుంది నమ్మాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు.Venkaiahnaidu బిజెపిను మొదటినుంచి నమ్మిన వ్యక్తి ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన వ్యక్తి. అంతే కాదు బిజేపి కి అంతగా బలం లేని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం నుంచి ఏకంగా జాతీయ అధ్యక్షుడు హోదా తో పాటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో పలు కీలక శాఖలు నిర్వహించిన వ్యక్తి వెంకయ్యనాయుడు. ఇది ఆయన పార్టీ ట్రాక్ రికార్డ్. ఇక ఆయనకు వ్యక్తిగతంగా కొన్ని ఇష్టాలు, bకొంత మంది వ్యక్తుల మీద మమకారం ఉండకూడదని ఏమీ లేదు. అయితే ఆ వ్యక్తిగత ఇష్టాన్ని రాజ్యాంగబద్ధ పదవిలో పక్షపాతంగా చూపించినపుడు మాత్రమే సమస్య అవుతుంది. సోమవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో కూర్చున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద జరిగిన పాయింట్ ఆఫ్ కండక్ట్ కింద జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానగా మరి వెంకయ్యనాయుడు నొచ్చుకునే అంతగా రాజ్యసభ చైర్మన్ సీట్లోనే ఆయన కన్నీళ్లు పెట్టుకునే వరకూ వెళ్ళింది. ఇది ఒక రాజ్యసభ సభ్యుడు కి, చైర్మన్ కు గతంలో ఎప్పుడూ జరగని సంఘటన. ఏకంగా చైర్మన్ సీటులో ఉన్న ఉపరాష్ట్రపతి ని ఒక రాజ్యసభ సభ్యుడు మీ మనసు ఎక్కడ ఉంది మీరు ఎక్కడ పని చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేయడం పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభలో గతంలో ఎన్నడూ చూడని సంఘటన.
జాగ్రత్త గా మాట్లాడాలి!
రాజ్యాంగబద్ధమైన హోదాల్లో అందులోనూ దేశానికి అత్యున్నత హోదాలో ఉన్న ఉపరాష్ట్రపతి మీద మాట్లాడే మాటలు గానీ సభలో వ్యవహరించే తీరు గానీ అన్ని రికార్డుల్లోకి ఎక్కుతాయి. పెద్దల సభగా పిలుచుకొనే రాజ్యసభలో ప్రతిమాట చాలా హుందాగా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం దాన్ని మించి మాట్లాడారు అని మాత్రం చెప్పుకోవాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనేది వైకాపా పార్టీ మాట. ఆ పార్టీ నాయకులు సైతం వెంకయ్య నాయుడును చంద్రబాబు నాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో ఖచ్చితంగా వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు కు మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రంలో ఆయన టిడిపి ను భుజానికెత్తుకున్న అంటూ పలుమార్లు బహిరంగంగానే వైకాపా నాయకులు విమర్శించారు.
సీఎం దగ్గర నుంచి…
ఒక విషయాన్ని నాయకుడు పాటించినప్పుడు, అతని వెనుక వున్న బలగం సైతం దానిని అనుసరిస్తుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు మీద రాజ్యసభ సభ్యుడు విజయసాయి వ్యాఖ్యలను గమనిస్తే గతంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉపరాష్ట్రపతి మీద మాట్లాడిన కొన్ని మాటలు గుర్తుకు వస్తాయి . bప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టాలని జగన్ ప్రభుత్వం భావించినపుడు ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు కొన్ని సభల్లో మాతృభాషకు ఎంత ప్రాధాన్యం ఉంది అనేది, మాతృభాషలో ప్రాథమిక విద్య చదువుకుంటే భాష ఔన్నత్యం ఎంత గా తెలుస్తుంది అనే విషయాన్ని చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇంగ్లీషు మాధ్యమం మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద కాకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీద కూడా జగన్ విమర్శలు చేయడం అప్పట్లో వివాదం అయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఏకంగా రాజ్యసభ చైర్మన్ సీట్లో ఉన్న వెంకయ్య నాయుడును విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడడం, పద్దతి లేకుండా వ్యాఖ్యలు చేయడం వరకు కూడా అక్కడే బీజం పడినట్లు అర్థమవుతోంది.
రాష్ట్రం పరువు పాయె!
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎక్కడ రాజకీయ నాయకుల తీరు మీద ఢిల్లీ సర్కిల్ లో పెద్ద సెటైర్లు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన లోక్సభ రాజ్యసభ సభ్యులను కనీసం ఇతర సభ్యులు పట్టించుకోని పరిస్థితి కూడా ఏర్పడింది. అంతేకాదు లోక్సభలో రాష్ట్ర ఎంపీలు మాట్లాడుతున్న సమయంలో మిగిలిన సభ్యులు సైతం వెక్కిరింత ధోరణిలో హావభావాలు ప్రదర్శించడం టీవీలో కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో అధికార పార్టీ గా ఉన్న వైఎస్సార్ సీపీకు ప్రతిపక్షంగా ఉన్న టిడిపి కు మధ్య ఉన్న విభేదాలను రాజ్యాంగబద్ధ పదవిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఉపరాష్ట్రపతి కి ముడి పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోగా ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రం పరువు తీసినట్లుంది. మిగిలిన సభ్యుల వద్ద సభలో ఎలా వ్యవహరించలో పాఠాలు చెప్పించుకునే స్థాయికి రాష్ట్ర ఎంపీలు దిగజారితే అది కూడా తెలుగు వారి ఆత్మాభిమానాన్ని చంపుకొన్నట్లే. ఒక అత్యున్నత చట్టసభలో స్పీకర్గా ఉన్న వ్యక్తి తో ఎలా మాట్లాడాలి అనే అంశం మీద దీనిని పాఠంగా తీసుకొని అన్ని పార్టీలు దృష్టి పెడితే మేలు. మిగిలిన సభ్యులకు ఇదో గుణపాఠం కావాలి.