TDP : తెలుగుదేశం పార్టీ పయనం మీద, ప్రస్తుతం వెళ్తున్న పద్ధతి మీద సగటు తెలుగుదేశం కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్న మాట నిజం. పంచాయితీ ఫలితాల్లో పూర్తిగా వెనుకబడిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం దారుణంగా దెబ్బ తినడం, కీలకమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరంగా జరగడం వంటి విషయాలన్నీ తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతున్నాయి. అసలు పార్టీలో ఏం జరుగుతోంది? వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది వారి ఊహకు కూడా అందడం లేదు. ఫలితంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడు రోజుల పర్యటనలో తీవ్రమైన భావోద్వేగం, భయం వారిలో కనిపించాయి.
** కుప్పం పర్యటనకు గతంలో చంద్రబాబు వస్తే ఆ ప్రాంతమంతా సంబరం లా ఉండేది. కుప్పం నుంచే కాకుండా జిల్లా నలు వైపుల నుంచి కార్యకర్తలు వచ్చేవారు. అయితే ఈసారి చంద్రబాబు పర్యటన లో అదేమీ కనిపించలేదు. చాలా తక్కువ మొత్తంలోనూ కార్యకర్తలు సమీకరించడం కనిపించింది.
** చంద్రబాబు పర్యటనకు వచ్చిన వారు సైతం టిడిపి తీరుపైనా ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వం మీద అంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించలేదు. చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు గతంలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం చంద్రబాబు మాటలకు అడ్డుతగులుతూ తెలుగు తమ్ముళ్లు పార్టీ పరిస్థితి గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే కార్యకర్తలు లోనే ఎక్కడో అభద్రతా భావం వచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
** చంద్రబాబు నాలుగు మండలాల్లో పర్యటనలు చేయాలని మొదట భావించినా అది కుదరలేదు. శాంతిపురం గుడి పల్లె ప్రాంతాల్లో మాత్రమే ఆయన పర్యటించారు. ఆయన బయటకు వచ్చి తన వ్యాన్ మీద ఎక్కినపుడు సైతం కార్యకర్తలు ప్రతి కూడలిలో ను అడ్డుకుని జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడం ఇక్కడ గమనించాలి. ఖచ్చితంగా ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకువస్తేనే పార్టీ బతుకుతుంది అన్న భావనలోకి టిడిపి కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పటికి బాగానే ఉన్నా తర్వాత ప్రమాదకరంగా మారవచ్చు. మానసికంగా వారు వేరే నాయకత్వాన్ని కోరుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయకత్వం మీద అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను నాయకుడిగా ఎలివేట్ చేస్తున్న డాన్ని సగటు టిడిపి కార్యకర్తలే జీర్ణించుకోవడం లేదు అన్న విషయం మొన్నటి చంద్రబాబు టూర్ లో స్పష్టంగా కనిపించింది.
** చంద్రబాబు ప్రసంగాన్ని పరిశీలిస్తే ఆయన పశ్చాత్తాపానికి లోనైనట్లు మాట్లాడారు తప్పితే నిర్భయంగా కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని దిశానిర్దేశం చేసే మాటలు మాట్లాడలేదు. భవిష్యత్తులో పార్టీలు కాపాడుకోవాలంటే ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయాన్ని ఎక్కడా కార్యకర్తలకు బోధించలేదు. ఎంతసేపు తాను రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి కోపము మరిచిపోయాను అని చెప్పడంతోనే ఉన్నారు తప్పితే, ఈ సమయంలో పార్టీని బతికించుకోవడం అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని ఆయన చెప్పలేక పోవడం విశేషం.
** నిన్న మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై భారీ అంకెలు ప్రకటించిన టిడిపి చంద్రబాబు కుప్పం పర్యటన తర్వాత దానిని పట్టించుకోలేదు. చంద్రబాబు సైతం కుప్పం సభలో పంచాయతీ ఎన్నికలలో తాను పట్టించుకోకపోవడం వల్లనే ఫలితాలు సరిగ్గా రాలేదు అని చెప్పడం ద్వారా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలు అయింది అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి పార్టీ లో ఆత్మధైర్యం దెబ్బతినకుండా ఆయన కొన్ని మాటలు చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేశారు.
** పార్టీ సమావేశాల్లో ఎప్పుడు చెప్పినట్లుగానే చంద్రబాబు ప్రసంగం సాగింది. దీనిని సగటు టిడిపి కార్యకర్తలు వంట పట్టించుకోవడం లేదు. పాత తరం వారికి చంద్రబాబు మాటలు ఎక్కుతున్నాయి తప్పితే కొత్త తరం వారికీ చంద్రబాబు మాటలు సూట్ కావడం లేదు. అన్ని పార్టీల వారు చాలా పరుషంగా మాట్లాడితే చంద్రబాబు మాత్రం చాలా సాదాసీదాగా ప్రసంగాన్ని ముగిస్తూ, అన్ని సమయాల్లోనూ చెప్పే మాటల్నే పదే పదే వల్లె వేయడం వల్ల ఆయన ప్రసంగానికి సైతం గతంలో వచ్చిన అంత రెస్పాన్స్ ఇప్పుడు కనిపించడం లేదు.
** సగటు టిడిపి కార్యకర్తలు ఇప్పుడు చంద్రబాబు కు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం సైతం బలంగా ఉండాలని వారు భావిస్తున్నారు. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలని, వైయస్ఆర్సీపీ నిలువరించాలి అంటే వారి భాషలోనే ముందుకు నడవాలి అన్నది తెలుగు తమ్ముళ్ళ భావన. దీనికి వారు సూచిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి కుటుంబం వారసుడిగా, ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బలమైన అభిమాన గణం ఉంది. అందులోను సామాజిక వర్గ బలం కూడా ఆయనకు ప్లస్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావడం లేదో, అసలు జూనియర్ ను తీసుకు రావడం లో ఉన్న అడ్డంకులు ఏమిటో చంద్రబాబు చెప్పడంలో తటపటాయిస్తూన్నారు. ఇది టిడిపి కార్యకర్తలతో అసహనానికి దారితీస్తోంది. చంద్రబాబు లోకేష్ బాబు కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు అని కొందరు వాదిస్తే, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కుట్రలను భరించలేకే పార్టీలోకి రావడం లేదు అన్న మాటలు బలంగా కార్యకర్తలు లోకి వెళుతున్నాయి. ఇది పార్టీకి మొదటికే మోసం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వాన్ని కనుక వద్దు అనుకుంటే, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ విచ్ఛిన్నం అవ్వక మానదు. తరుముకొస్తున్న ఈ సొంత పార్టీ అసహనం ముప్పును… చంద్రబాబు ఎలా ఎదుర్కుంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.