Double murder: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరు గ్రామంలో శుక్రవారం దారుణం జరిగింది. అంజనమ్మ, లక్ష్మీదేవి లను దుండగులు కత్తులతో నరికి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే తల్లి, కుమార్తెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
విషయంలోకి వెళితే..అంజనమ్మ కోడలు చరిష్మ 2019లో హత్యకు గురైంది. అయితే కోడలిని హత్య చేసింది అంజనమ్మ కుటుంబ సభ్యులేనన్న ఆరోపణలు వచ్చాయి. నాడు చరిష్మ మృతదేహాన్ని అంజనమ్మ ఇంటి ఆవరణలోనే ఖననం చేసి అక్కడే సమాధి నిర్మించారు. ఆ ఘటనపై అంజనమ్మ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే అంజనమ్మ, ఆమె కుమార్తె హత్యకు గురైయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామానికి చేరుకున్న అంజనమ్మ, ఆమె కుమార్తెను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.