Dr.YS Suneetha Reddy: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరణంలో ఆ శాఖ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేయించడం, కేసు తప్పుదారి పట్టించేలా సీబీఐపైనే ఆరోపణలు చేస్తుండటంతో సీబీఐ దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్ కుటుంబీకులు, పులివెందులకు చెందిన పలువురు వ్యక్తులు గతంలో సీబీఐ విచారణలో వెల్లడించిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Dr.YS Suneetha Reddy: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ
గత నాలుగు రోజులుగా వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో పలువురు వెల్లడించిన విషయాలు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. తాజాగా నిన్న వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ బయటకు వచ్చింది. సీబీఐ అధికారుల దర్యాప్తు తీరునే తప్పుబడుతున్న నేపథ్యంలో ఇవి వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఈ అంశంపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.
Read More: YS Viveka Climax: కొన్ని గంటల్లో పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి అనుమతులు సిద్ధం..!
అవినాశ్ రెడ్డి పాత్రపై విచారణ చేయించాలి
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్యలో వరుసకు తన సోదరుడు అయిన కడప ఎంపి అవినాష్ రెడ్డి పాత్ర ఉందనీ, ఈ దిశగా విచారణ చేయాలంటూ డాక్టర్ సునీతారెడ్డి నేరుగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. స్పీకర్ ఓంబిర్లాకు రాసిన లేఖలో పలు కీలక విషయాలను వెల్లడిస్తూ తాను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కాపీతో పాటు ఇతర నిందితులు, సాక్షులు సీబీఐకి ఇచ్చిన సేట్ మెంట్ కాపీలను ఆమె జత చేశారు. తన తండ్రి అంటే అవినాష్ రెడ్డికి గిట్టదని ఆరోపించిన డాక్టర్ సునీత.. తన తండ్రి హత్యలో అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉందని కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా తెలిపిన సంగతి తెలిసిందే.