Dussehra: దేశ వ్యాప్తంగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి విజయదశమి (దసరా). ప్రతి ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి అరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి, ఆ తరువాతి మూడు రోజులు సరస్వతిదేవికి పూజలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక అనవాయితీ. ఆలయాల్లో అమ్మావారికి తొమ్మిది రోజులు రోజుకు ఒక్కో అలంకారం చేస్తారు. పదవ రోజు విజయదశమి నాడు పార్వేట ఉత్సవం, శమీ పూజ, దసరా పండుగ జరుపుకుంటారు. తెలంగాణతో పాటు ఏపిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుండి నవమి వరకూ బతుకమ్మ ఆడుతారు.
Dussehra: దేవి శరన్నవరాత్రి వేడుకలు
చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ పండుగ కొన్ని ప్రాంతాల్లో విజయ దశమిగా, మరి కొన్ని ప్రాంతాల్లో దసరాగా వాడుకలో ఉంది. మనిషిలోని కామ, క్రోధ, మోహ, లోభ, మధ, మత్సర, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే దుర్గుణాలను తొలగించమని దుర్గామాతను పూజించడమే ఈ నవరాత్రుల అంతర్యం.
దేవి శరన్నవరాత్రి వేడుకలు
ఇక పురాణాల్లో విజయదశమికి ఎంతో ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో కొనసాగిన రామాయణానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారు. యుద్ధంలో రావణాసురుడిని రాముడు అంతం చేసిన రోజు ఇదేనని పురాణోక్తి. ఆ విజయానికి గుర్తు చేసుకుంటూ చేసుకునే సంబరలే ఈ దసరాగా చెబుతుంటారు. అంతే కాకుండా ద్వాపరయుగంలో ఇదే రోజున మరో కీలక ఘట్టం జరిగిందని చెబుతారు. పాండవులు, కౌరవుల మధ్య కొనసాగిన కురుక్షేత్ర యుద్ధానికి ఆరంభం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతాయి. జూదంలో ఓడిన పాండవులు 12 ఏళ్లు వనవాసం పూర్తి చేసుకున్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. ఆ ఏడాది పాటు వారు మారువేషాల్లో నిరసిస్తారు. ఈ క్రమంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్తారు. అలా దాచిన ఆయుధాలను కురక్షేత్ర యుద్ధానికి బయలుదేరే సమయంలో తిరిగి తీస్తారు. ఆ రోజునే విజయదశమిగా జరుపుకుంటారని పురాణాల్లో పేర్కొనబడి ఉంది.
మహిషాసుర సంహారం
మరోక కథ ఏమంటే.. బ్రహ్మదేవుడి వరాలతో గర్వితుడుగా మారిన మహిషాసురుడు ముల్లోకాలనూ శాసించే స్థాయికి చేరుకుంటాడు. దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించి స్వర్గలోక సింహాసనం అధిష్టిస్తాడు అప్పుడు దేవేంద్రుడు, దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడి వద్దకు వెళ్లి వేడుకోగా వారి ఆగ్రహాజ్వాలలో స్త్రీ రూపం జన్మిస్తుంది. వారి తేజస్సుతో, అంశతో ప్రత్యక్షమైన దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి సంహరిస్తుంది. అందుకే దసరా రోజున విజయలక్ష్మిని పూజిస్తారు. ఆమెను మహిషాసుర మర్ధనిగా కీర్తిస్తారు. విజయదశమి రోజున జంతు బలి ఇవ్వడంతో పాటు జమ్మిచెట్టుకు షమీపూజ చేస్తారు. రావణ దహనం నిర్వహిస్తారు. కాగా దేశ వ్యాప్తంగా దసరా వేడుకల సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి నిత్యం పూజలు నిర్వహిస్తారు.