పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో ఇవేళ ఉదయం 7.26 గంటల సమయంలో భూమిలో పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. వారం రోజుల్ల రెండు మూడు సార్లు ఇలా జరిగినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో కృష్ణానదికి మరో పక్క ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల మండలాల్లోనూ భూమి కంపించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. రెండు నుండి మూడు సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయని అంటున్నారు.
భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. గతంలోనూ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. కృష్ణానదిలో భారీ ఎత్తున ఇసుక క్వారీయింగ్ జరుగుతుండటం వల్లనే తరచు ఇలా భూప్రకంపనలు వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధికార యంత్రాంగం నుండి వీటిపై ఎటువంటి ప్రకటన లేదు.