Eatela Rajendar : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సంబంధిత గ్రామంలో పర్యటించిన కలెక్టర్, ఇతర అధికారులు.. వారి అభిప్రాయాలను తెలుసుకుని.. ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైన మాట వాస్తమేనని ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఎపిసోడ్లో ఈటల రాజేందర్ వేసిన అడుగు సక్సెస్ అయింది.
కోర్టులో ఈటల తొలిగెలుపు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ ఉదంతంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీష్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లబోదని హైకోర్టు పేర్కొంది. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసిన హైకోర్టు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వాలని సూచించింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలంటూ సంచలన కామెంట్లు చేసింది. అయితే, శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇవ్వమనేలా ఉండకూడదని ఘాటుగా స్పందించిన హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఇక, ఈ కేసు తదుపరి విచారణను ఎల్లుండికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
ఈటల గేమ్ విజయం సాధించినట్లేనా?
తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు.. ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తా న్యాయం జరుగుతుందని తెలిపారు. తాజా ఉదంతం నేపథ్యంలో ఈటల రాజేందర్ ప్రణాళికే విజయవంతం అవుతుందా? అనే చర్చ జరుగుతోంది.