Eluru : సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే సామాన్యులు మొదలుకొని నేతలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. తమకు తెలిసిన, తమ పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపులో తమ భాగస్వామ్యం ఉండాలని భావిస్తుంటారు. వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ లలో బారులు తీరుతుంటారు. అయితే ఓటరు లిస్ట్ లో పేరు ఉండి తీరా కేంద్రం లోపలకు వెళ్లిన తరువాత కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. మీ ఓటు లేదని చెప్పడమో, మీ ఓటు వేరే వార్డుకు మారిందని చెప్పడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురి అవుతుంటారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఏకంగా ఓ మంత్రికే చేదు అనుభవం ఎదురైంది.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు కావడం ఏలూరులో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మంత్రి నాని 25వ డివిజన్ లో గల మండల పరిషత్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లారు. అయితే ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను మంత్రి ప్రశ్నించినా వారు ఏమి సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఓటు వేసే అవకాశం లేకపోవడంతో నిరుత్సాహంతో నాని వెనుతిరిగారు.
ఏలూరు ఓటర్ల జాబితాలో తప్పుల తడకపైనే రెండు రోజుల క్రితం హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ధర్మాసనం ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా పోలింగ్ యధావిధిగా నిర్వహణకు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించవద్దని ధర్మాసనం ఆదేశించింది.