Eluru TDP: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం స్థానం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి మూడో సారి లోక్ సభలోకి అడుగు పెట్టాలని ఆశ పడుతున్నారు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు). అయితే ఈ సారి టీడీపీ టికెట్ ఆయనకు కేటాయించడం డౌటేనంటున్నారు. ఆయన కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాల కారణంగా కొంత కాలంపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరల ఏలూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి కుటుంబానికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. తమ ట్రస్ట్ ద్వారా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిలు మాగంటి బాబుకు ఎంపీ సీటు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
ఎందుకంటే .. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో పరిచయాలు ఉండటం, పార్టీ అదినేత చంద్రబాబుతో నేరుగా మాట్లాడే స్వతంత్రం ఉండటంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చుకు ఎక్కువగా సర్దుబాటు చేయరనే అనుమానం ఎక్కువ మంది ఇన్ చార్జిల్లో నెలకొని ఉంది. వాస్తవానికి చంద్రబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీకి భారం కాకుండా ఉండేందుకు ఆర్ధికంగా స్థితిమంతులకే టికెట్లు ఇస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మీద ఆధారపడకుండా వ్యక్తిగతంగా ఖర్చు పెట్టే నాయకులకే సీట్లు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో మాగంటి బాబు స్థానంలో ఆయన బావ మరిది కొమ్మారెడ్డి రాంబాబుకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అంటున్నారుట. విశాఖలో స్థిరపడిన కొమ్మారెడ్డి రాంబాబు ఆర్దికంగా బలవంతుడు కావడంతో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు ఆయన ఆభ్యర్ధిత్వంపై అభ్యంతరం లేదని పేర్కొంటున్నారుట. ఆయన పారిశ్రామిక వేత్త కావడంతో తమ నియోజకవర్గాల ఖర్చునకు ఎక్కువగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని ఇన్ చార్జ్ లు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గ పరిధిలో మాగంటి బాబు స్థానంలో ఆయన బావ మరిది రాంబాబుకు సీట్ దాదాపు కన్ఫర్మ్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాంబాబుకు మాగంటి బాబు సొంత బావ కావడంతో తనకే సీటు కావాలని బావ (బాబు) పట్టుబడితే ఆయన (రాంబాబు) వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మాగంటి కుటుంబంపై నియోజకవర్గంలో సానుభూతి ఉండటంతో చంద్రబాబు ఆయనకే టికెట్ ఇస్తారా..? లేక ఇటు పార్టీకి, అటు అభ్యర్ధులకు అండగా నిలిచే కొమ్మారెడ్డి రాంబాబుకు టికెట్ ఇస్తారా..? అనేది వేచి చూడాలి..! మాగంటి బాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో ఏలూరు పార్లమెంట్ నుండి పోటీ చేసి సమీప తెలుగుదేశం అభ్యర్ధి బొళ్ల బుల్లి రామయ్య చేతిలో కేవలం 1,635 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు.
ఆ తర్వాత 1998 ఎన్నికల్లో అదే బుల్లి రామయ్యపై 23వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలి సారి లోక్ సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మళ్లీ బుల్లి రామయ్య చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో దెందులూరు అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2007 లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దెందులూరు మండలంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. 2009 ఎన్నికల్లో మరల ఏలూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కావూరి సాంబశివరావు చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తోట చంద్రశేఖర్ పై విజయం సాధించి రెండో సారి లోక్ సభలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో మరల పరాజయం పాలైయ్యారు.
వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తెరపైకి కొత్త కోణం