YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ 1 నిందితుడుగా ఉన్నారు. హత్య స్థలంలో సాక్షాలు తారుమారు చేశారన్న అభియోగంపై తొలుత ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే మూడు నెలల్లో సిట్ చార్జి షీటు దాఖలు చేయకపోవడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదల అయ్యారు. అయతే విచారణపైన, సాక్షులపైనా గంగిరెడ్డి ప్రభావం చూపుతారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఏపి హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపి హైకోర్టు సీబీఐ పిటిషన్ ను తోసిపుచ్చింది.
హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించగా తీవ్ర నేరారోపణలు ఉన్న కేసులో స్పష్టమైన ఆధారాలు ఉంటే డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేయవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. సీబీఐ పిటిషన్ పై మెరిట్స్ ఆధారంగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ కేసును మళ్లీ ఏపి హైకోర్టు రికమండ్ చేసింది. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో వివేకా కేసు తెలంగాణకు బదిలీ కావడంతో సీబీఐ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
చివరకు తెలంగాణ హైకోర్టు గత నెలలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5వ తేదీ లోపు సీబీఐ కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయవాదుల సలహా మేరకు ఎర్ర గంగిరెడ్డి కోఠి లోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డిని కోర్టులో ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. తదుపరి కస్టడీ విచారణ కొరకు సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
డీఆర్డీఓ సైంటిస్ట్ పై పాక్ హానీ ట్రాప్ .. అరెస్టు