ఏపి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తున్నది రాజధాని ప్రాంతంలో జరిగిన భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహరం. ఇది క్రిమినల్ కేసు కాదు అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం టీడీపీ వర్గాలకు హాపీ న్యూస్ అయ్యింది. అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయాలన్న వైసీపీ ప్రభుత్వ వ్యూహానికి హైకోర్టు గండికొట్టినట్లు అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఏపి సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ ప్రభుత్వ తదుపరి వ్యూహం ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో వైసీపీ ప్రభుత్వానికి కీలక పాయింట్ లను అందించారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీజెపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు,
ప్రభుత్వం తప్పకుండా సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయాల్సిన కేసు ఇది అంటూ ఐవైఆర్ పేర్కొన్నారు. నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే రాజధాని కృష్ణాతీరంలో ఉంటుంది అన్నారు కాబట్టి దీనిలో రహస్యం ఏమి లేదు అని కోర్టు వ్యాఖ్యానించడం సరికాదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలోనే రాజధాని వస్తుంది అనే సమాచారం ఆ ప్రకటన ద్వారా తెలిసే అవకాశం లేదనీ అందు వల్ల తుది నిర్ణయం తీసుకునే వరకూ రాజధాని అంశం రహస్యంగానే సాగిందని, సెక్యురిటీలను షేర్ల విషయంలో ఉండే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఈ అంశాలకు వర్తించదు అని కోర్టు పేర్కొన్నదన్నారు.
ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన రహస్య సమచారంతో లబ్దపొందడమే నేరంగా భావించినప్పుడు ప్రభుత్వంలోని రహస్య సమాచారంతో లబ్దిపొందడం అంతకు మించిన నేరమే అవుతుందని ఐవైఆర్ పేర్కొన్నారు. అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో కోర్టు తీర్పు ఒక్క అమరావతి అంశానికే పరిమితం కాదనీ రేపు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా రహస్య సమాచారం ఉన్న ఏ అధికారి అయినా చుట్టుపక్కల భూములు కారుచౌకగా కొని ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్ముకున్నా ఈ తీర్పు ప్రకారం చట్టరీత్యా నేరం కాదన్న భావన వస్తుందన్నారు. దాని పరిణామాలు పాలనా వ్యవస్థపై విపరీతంగా ఉంటాయన్నారు ఐవైఆర్ కృష్ణారావు.
ఇప్పటికే ఐవైఆర్ లాంటి మేధావులు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూచనలు చేశారనీ, ప్రభుత్వ న్యాయ నిపుణులు కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.