రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అవేశంలోనో, అన్పోపదేశం గానో చేసిన వ్యాఖ్యలు సంచలనం అవ్వడమో లేక వివాదాాస్పదం కావడంతో తాను అలా అనలేదనీ, తన ఉద్దేశం అది కాదనీ, మీడియా వక్రీకరించిందనీ ఆ తర్వాత చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజా మాజీ హోంశాఖ మంత్రి, ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖంగా రావడంతో స్పందించి వివరణ ఇచ్చారు. తానేదో సరదాగా చేసిన వ్యాఖ్యలను అపార్ధం చేసుకుని వైరల్ చేశారని మేకతోటి సుచరిత పేర్కొన్నారు.
ఇటీవల కాకుమాను లో కార్యకర్తల సమావేశంలో.. తాను రాజకీయ నాయకురాలిని అయినా ఓ భార్య గా భర్త అడుగు జాడల్లోనే నడవాల్సి ఉంటుందనీ, ఆయన పార్టీ మారి తనను రమ్మంటే భార్యగా ఆయన వెంట వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆమె భర్త ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ టీడీపీలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనే అని స్పష్టం చేసిన ఆమె తాను ఒక స్టేట్ మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారని అన్నారు. అలా కాకుండా ‘నా భర్త పార్టీ మారతాను, నువ్వు నాతో రా అంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా’ అని పేర్కొన్నారు. తన భర్త ఒక పార్టీలో.. తాను మరొక పార్టీలో…తమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని, ఉంటే అందరం ఒకే పార్టీలోనే ఉంటామని పేర్కొన్నారు సుచరిత. రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైఎస్ జగన్ తో ఉండాలని అనుకున్నామని అన్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె పార్టీ మారబోతున్నారని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలు సంకేతమని ఎవరికి తోచిన విధంగా వారు భాష్యం చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో సుచరిత స్పందించారు. తాను కార్యకర్తలతో సరదాగా మాట్లాడిన మాటలను అపార్ధం చేసుకుని అన్నారు. ఆ వ్యాఖ్యల వీడియోను ఎవరో వైరల్ చేస్తే దానిని బ్రేకింగ్ న్యూస్ గా వేయడం చూసి నవ్వొచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉంటే వైసీపీలోనే ఉంటాననీ, లేదంటే ఇంట్లో ఉంటానని స్పష్టం చేశారు. ఒకటే మాటగా, ఒకటే బాటగా ఉంటాననీ, ప్రజల్లో లేని పోని అపోహాలు కల్పించవద్దని ఆమె కోరారు. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉంటుందని చెప్పడంలో తప్పే ముందని ఆమె ప్రశ్నించారు. గతంలో తాను తన భర్త దయాసాగర్ అనుమతితోనే కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి చేరాననీ, ఆ విషయాన్ని గుర్తు చేసుకునే అలా మాట్లాడినట్లు సుచరిత పేర్కొన్నారు.