EX MP Chinta Mohan: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్.. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ముగ్గురు నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చింతా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. చింతా విమర్శలు చేసిన ఆ ముగ్గురు మామూలు నేతలు కాదు. ఒకరు మాజీ ప్రధాన మంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి. ఇంకొకరు రాజకీయ పార్టీలు, నేతల తలరాతలు మార్చగల రాజకీయ వ్యూహకర్త. ఇలా ఈ ముగ్గురు ప్రముఖులపై చింతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇంతకూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటీ, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంలోకి వెళితే…
‘పీకే’ ఓ బచ్చా
రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో బీజేపీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందనీ, ఈ విషయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకీ అర్ధం కావడం లేదనీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై చింతా మోహన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ ను ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాార్టీ గురించి ప్రశాంత్ కిషోర్ కు ఏమి తెలుసునని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ యే కాదు ఆయన అయ్య, తాత వచ్చినా రాహుల్ గాంధీ ని ప్రధాని కాకుండా ఆపలేరని అన్నారు. ప్రశాంత్ కిషోర్ చరిష్మా గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తొలుత కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. ఆ సక్సెస్ అనంతరం పలు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలకు పని చేశారు. ఆ క్రమంలో ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఆయన టీమ్ పని చేసింది. ఆ తరువాత తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ గెలుపునకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాకర్తగా పని చేశారు. నాలుగైదు రాష్ట్రాల్లో పార్టీల గెలుపునకు, కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడానికి పని చేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ను పట్టుకుని ఓ బచ్చా అని అనడం విడ్డూరంగా ఉంది కదూ.
EX MP Chinta Mohan: కాంగ్రెస్ బలహీన పడటానికి ఆ ఇద్దరే కారణం
ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బలహీన పడటానికి ఇద్దరు నేతలు కారణమని చెప్పుకొచ్చారు చింతా మోహన్. వారిలో ఒకరు మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్శింహరావు అంట. ఆయన హయాంలో జరిగిన ఆయోధ్య ఘటనతో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు దూరమయ్యారని పేర్కొన్నారు చింతా. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపిన ఘనత పివీదని అందరికీ తెలుసు. అదే మాదిరిగా పీవీ హయాంలో చేపట్టిన ఆర్ధిక సంస్కరణలు ఎంత మేలు చేశాయో తరువాత వచ్చిన పాలకులకూ తెలుసు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని అన్నారు చింతా. చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దింపేందుకు హైదరాబాద్ పాత బస్తీలో ఒక నాయకుడు మారణహోమం సృష్టించారని తెలిపారు. వందలాది మంది కాళ్లు, చేతులు తీసేశారనీ, అయితే ఆ నాయకుడు ఇప్పుడు లేడనీ, చనిపోయాడని చెప్పారు. వాస్తవానికి వైఎస్ఆర్ సమైక్యవాది అనేది అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా కేసిఆర్ ను తెలంగాణ వాదాన్ని వైఎస్ఆర్ తీవ్రంగా విమర్శించిన సందర్భం ఉంది. ఇలా ముగ్గురు నేతలను విమర్శించిన చింతా మోహన్ ..2024 ఎన్నికల్లో కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలే పాలన సాగిస్తున్నాయని పేర్కొన్న చింతా ..కేవలం ఆరు శాతం జనాభా మాత్రమే ఉన్న ఆ వర్గాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. ఏపి సీఎం వైఎస్ జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ గారూ మీ నాన్న ఆరేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నారు, ఇక చాలు తప్పుకోండి’ అని వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?