Janasena: ఇటీవల హైదరాబాద్ లో వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం, అదే క్రమంలో ముద్రగడ పద్మనాభం ఎస్సీ, బీసీ నేతలతో సమావేశం నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ముద్రగడ పద్మనాభం దళిత, బీసీ, కాపు సోదరులు రాజ్యాధికారం కోసం చైతన్యవంతం కావాలంటూ బహిరంగ లేఖ రాశారు. ఈ వర్గాలను కలుపుకుని ముద్రగడ రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై మాజీ ఎంపి., కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఉండగా, మరో పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారంటే అది వైసీపీ వ్యూహంలో భాగమేనని ఆరోపించారు. హైదరాబాద్ లో సమావేశమైన కాపు నేతల్లో పార్టీ పెట్టి నడిపే శక్తి ఎవరికీ లేదన్న హరేరామ జోగయ్య.. జనసేనను కాదని పార్టీ పెడితే కాపు ఓట్లు చీలడం కోసమేనని అభిప్రాయపడ్డారు.
నేతల్లో లోపించిన ఐక్యత
“మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది” అన్న సామెత మాదిరిగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఉన్నప్పటికీ ఐక్యత లోపించిందని ఆ సామాజికవర్గ నేతలే అంగీకరిస్తున్నారు. మరో పక్క జనసేనతో పొత్తు పెట్టుకుని దూరమైన కాపు సామాజికవర్గాన్ని దగ్గరకు చేసుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుండగా, ఈ కూటమికి కాపు సామాజికవర్గం దగ్గర కాకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, ఆ క్రమంలోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి.
Janasena: 2019 ఎన్నికల్లో వైసీపీ మద్దతుగా
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజికవర్గ ఓట్లే కీలకం కానున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం టీడీపీని కాపు కాయడంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి టీడీపీకి జనసేన దూరం కావడంతో మెజార్టీ కాపు సామాజికవర్గ నేతలు వైసీపీ మద్దతుగా నిలిచారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిస్తే మళ్లీ చంద్రబాబుతో కలుస్తారన్న భావనతో ఉన్న ఆ సామాజికవర్గ నేతలు వైసీపీకి కాపు కాశారు. మరో పక్క జనసేన అభ్యర్ధుల ప్రభావం వల్ల కూడా 30కిపైగా స్థానాల్లో వైసీపీ గెలిచింది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా వంగవీటి రాధాను పార్టీలోకి చేర్చుకోవాలన్న ప్రయత్నం వైసీపీ చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి.