AP CM YS Jagan: సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మరో మారు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై ఉండవల్లి మీడియా సమావేశంలో గట్టిగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ప్రతిపక్ష పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తిరిగి స్పందిస్తూ ప్రతి విమర్శలు, కౌంటర్ లు ఇస్తున్నారు కానీ ఉండవల్లి చేసే ఆరోపణలు, విమర్శలపై వైసీపీ నుండి అంతగా రియాక్షన్ కనిపించడం లేదు. ఉండవల్లి చేస్తున్న విమర్శలు గానీ ఆరోపణలు గానీ జరుగుతున్న తప్పులను వేలెత్తి చూపుతుండటంతో పాటు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి వైసీపీ నేతలకు అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబుపైనా ఇదే రీతిలో ఉండవల్లి విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఉండవల్లికి టీడీపీ ముద్ర వేసే పరిస్థితి లేదు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 30సంవత్సరాల పాటు పాలన సాగించాలనే ఆశయంతో అధికారంలోకి వచ్చిన జగన్ పాలనను చూస్తుంటే ఇంత ఘోరంగా ఉంటుందని తానెప్పుడూ అనుకోలేదన్నారు. జగన్ పాలనలోనూ అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు.
AP CM YS Jagan: రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం
ఓ పక్క తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బాగా పరిపాలన చేస్తున్నారని ప్రశంసించిన ఉండవల్లి.. ఏపిలో జగన్ మాత్రం రెండు సంవత్సరాల్లోనే ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందన్నారు. ఇసుక, మద్యం, పెట్రోల్, కరెంటు ఇలా అన్ని ధరలూ పెంచుకుంటూ పోయారనీ, మరో వైపు అప్పులూ పెరుగుతున్నాయని అన్నారు. ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి పొలాలన్నీ సశ్యశ్యామలం అవుతాయనీ, పంటల దిగుబడితో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించానన్నారు. కానీ పోలవరం పూర్తి అయ్యే పరిస్థితి కనబడటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే రెండు సంవత్సరాలుగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే స్థితిలో కూడా లేదని ఉండవల్లి విమర్శించారు. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోవడంపైనా ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బిల్లులో లోపాలు ఉన్నాయని ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం ఆ బిల్లులను డ్రాప్ చేసుకున్నట్లు ప్రకటించారనీ, బిల్లులో లోపాలు ఉన్నాయంటే అది ప్రభుత్వ అసమర్ధతే అని ఉండవల్లి పేర్కొన్నారు.
సానుభూతి డ్రామా కాదు
ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చరిత్ర గురించి అందరికీ తెలుసునన్న ఉండవల్లి.. సీనియర్ నేత చంద్రబాబును వైసీపీ మంత్రులు దూషించడం సరికాదని హితవు పలికారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి గౌరవమివ్వాలని అన్నారు. చంద్రబాబు ఏడుపు డ్రామా అని తాను అనుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు సానుభూతి పని చేయదని తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై క్లైమోర్ లు పేలినప్పుడు, ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు ఆయన రాష్ట్రం అంతా తిరిగినా సానుభూతి పని చేయలేదన్నారు. వైఎస్ మరణానంతరం జరిగిన 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో జగన్ కు సానుభూతి వర్క్ అవుట్ కాలేదన్నారు. ఒక్క రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడే సానుభూతి పని చేసిందన్నారు. చంద్రబాబు అంతగా ఆవేదన చెందాల్సిన అవసరం లేదని ఉండవల్లి అభిప్రాయ పడుతూ అలా మాట్లాడిన వారి మానసిక స్థితి సరిగా లేదని అన్నారు.