YCP: ఏపిలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ, ప్రతిపక్షాల మద్య నిత్యం మాటల యుద్దం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల దాడి జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన పార్టీలు జనాల్లో తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్నట్లుగా రాజకీయ వాతావరణం నెలకొంది.ఈ తరుణంలో ఆ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆ నేత వైసీపీలో చేరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన నగదు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అఘా మొహిద్దీన్ ఖాన్ కూడా వైసీపీలో చేరారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితుడనై తాను పార్టీ లో చేరినట్లు నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.