Fake Currency: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ మంది మంచికి, విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే కొందరు వాటి ద్వారా తప్పులు, నేరాలు ఎలా చేయవచ్చు అనేవి తెలుసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేయడం తెలుసుకున్న ఓ యువకుడు అవి చలామణి చేస్తూ కోటీశ్వురుడు అయ్యాడు. రెండేళ్ల కాలంలో రెండు కోట్ల వరకూ సంపాదించాడు. పోలీసు దర్యాప్తులో ఈ విషయాలు తెలిసి వారు ఆవాక్కయ్యారు. విషయంలోకి వెళితే…
ఇటీవల కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో దూలం సాయి. గొట్టిముక్కల రవిశరన్, భీమవరపు యజ్ఞప్రదీప్, నాగమల్లేశ్వరరావు లు నకిలీ నోట్లు చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముద్దాయిలను విచారిస్తే నకిలీ నోట్ల తయారీలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మూలాలు ఉన్నట్లు కనుగొన్నారు. వీరికి నకిలీ నోట్లు సరఫరా చేసిన కృష్ణారెడ్డి అనే యువకుడిని పట్టుకున్నారు. ఇతన్ని పోలీసులు విచారించగా రూ.200, 500 నోట్లను తయారు చేసి చలామణి చేస్తున్నట్లు అంగీకరించాడు.
యూట్యూబ్ వీడియో లు చూసి నకిలీ నోట్లు తయారు చేశానని అతను చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అతను రెండు సంవత్సరాలుగా ఈ నకిలీ నోట్ల చలమణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రెండు కోట్ల వరకూ సంపాదించి ఉంటాడని భావిస్తున్నారు. అతను వీటితో పాటు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడుట. వడ్డీకి ఇచ్చే డబ్బుల్లో ఒక్కో కట్టలో అయిదు వరకూ నకిలీ నోట్లు పెట్టి చెలామణి చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. అనపర్తి పెట్రోల్ బంక్ లో పని చేసే వ్యక్తికి కమీషన్ కూడా నోట్ల మార్పిడి చేసినట్లు చెప్పారు. దీంతో నోట్ల తయారీ సూత్రధాని కృష్ణారెడ్డితో పాటు అతనికి సహకరించిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు.