Fire Accident: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కాగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీలోని నాల్గవ యూనిట్ లో రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తొలుత నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తొంది. మృతుల్లో నలుగురు బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడుతుండటంతో కింది విభాగంలో పని చేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు.
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను, మృతుల వివరాలు సేకరిస్తున్నారు. కాగా విజయవాడ ఆసుపత్రికి 12 మంది తరలించగా వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వీరిని ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారందరికీ 70 శాతంపైగా గాలిన గాయాలు అయ్యాయి. ఈ ఫ్యాక్టరీలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని సూపర్ వైజర్ రాజు పేర్కొన్నారు.