నూతన సంవత్సరం రెండవ రోజే ఏపిలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
సేకరించిన సమాచారం ప్రకారం..తూర్పు గోదావరి జిల్లా రావులపాడు మండలం గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరు నుండి కాకినాడకు టమాటా లోడ్ తో వెళుతున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాలపురానికి చెందిన సతీష్ (21), చంటి 20), కొత్తపేట మండలం కండ్రిక కు చెందిన సురేందర్ మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మామిడి రాము, ఇంజనీరింగ్ విద్యార్థి పి సాయి ప్రదీప్ లు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.