Visakha Steel Plant Issue: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునే అంశంపై సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనలు చేస్తున్నా, ఏపి, తెలంగాణ సర్కార్ లు లేఖలు రాసినా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తున్న వీవీ లక్ష్మీనారాయణ తాజాగా ఏపి తెలంగాణ సర్కార్ లకు కీలక వినతి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపి సర్కార్ చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్)కు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
హిందూస్తాన్ న్యూస ప్రింట్ లిమిటెడ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయదల్చుకోగా కేరళ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు, దీన్ని కేరళ పేపర్ ప్రొడక్స్ లిమిటెడ్ గా బదలాయించిందని, దీని కోసం రూ.146 కోట్లతో బిడ్స్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుద్దరించడానికి ఏపి, తెలంగాణ సర్కార్ లు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. తక్షణమే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏపి లేదా తెలంగాణ ప్రభుత్వాలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎన్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్)లో పాల్గొనాలని అన్నారు లక్ష్మీనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి పదార్ధాల సరఫరా, ప్లాంట్ నిర్వహణ కు అవసరమైన ప్రైవేటు కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఎపీ, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ఈ నేపథ్యంలో కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ బిడ్డింగ్ లో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకు కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల బిడ్డింగ్ లో సింగరేణి లేదంటే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదంటే నీటి పారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాల్న లక్ష్యంతోనే సీఎం కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా ఆసక్తి వ్యక్తీకరణ కోసం వెంటనే విశాఖకు వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం కేసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తొంది. ఒకటి రెండు రోజుల్లోనే విశాఖ వెళ్లనున్న బృందం .. యాజమాన్యం సేకరించదలచుకున్న నిధులు, తిరిగిచ్చే ఉత్పత్తులు, లేదంటే నిధులను వెనక్కి చెల్లించే విధివిధానాలు, ఇతర నిబంధనలు, షరతులను అధ్యయనం చేస్తుంది.