మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని అశాభావం వ్యక్తం చేశారు ప్రహ్లాద్ జోషి. ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, ఉమ్మడి ఏపి సీఎంగా కిరణ్ సేవలు అందించారనీ, బీజేపిలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని అన్నారు ప్రహ్లాద్ జోషి.

ఈ సందర్బంగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 1952 నుండి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని, తన తండ్రి అమరనాథ్ రెడ్డి, తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో అనేక రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతుందన్నారు. ప్రజల మద్దతు పొందలేకపోతుందన్నారు. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవినీతిని నియంత్రించే స్థితిలో లేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు పవర్ మాత్రమే కావాలని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. అయినా దేశం అభివృద్ధి కోసం బీజేపీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు.
బీజేపీ దేశ వ్యాప్తంగా బలోపేతం కావడం సులువుగా జరగలేదని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కింద స్థాయి క్యాడర్ నుండి పెద్ద స్థాయి నేతల వరకూ పడిన కష్టం ఫలితమే బీజేపీకి వరుస విజయాలు లభిస్తున్నాయని తెలిపారు. 2014 నుండి బీజేపీ విజయాలు కొనసాగుతున్నాయని అన్నారు. పేదల కోసం ధైర్యం నిలబడటం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే బీజేపీ ఈ స్థాయికి వచ్చిందన్నారు. మోడీ పని తీరు, అంకిత భావంతో అవినీతిని అణిచివేసేందుకు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. 20 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుని బీజేపీలో చేరానని అన్నారు.
ఏడు శాతం నుండి బీజేపీ 30కిపైగా శాతంకు ఎలా పెరిగిందో కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలన్నారు. విశ్లేషణ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓటముల నుండి కాంగ్రెస్ గుణ పాఠం నేర్చుకోవడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని అన్నారు. మోడీ, అమిత్ షా నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు. పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగిస్తే అది చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
వరంగల్లు పోలీసుల నోటీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రియాక్షన్ ఇది