అన్నమయ్య జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. రైల్వే కోడూరు మండలం కమ్మపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా .. మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఓబులవారిపల్లి నుండి రైల్వే కోడూరుకు ఆటో వెళుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురు ఉండగా, అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు నెలల చిన్నారి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.
ఓబులవారిపల్లి మండలం అయ్యలరాజువల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి రైల్వే కోడూరులో కాపురం ఉంటున్నాడు. తన కుమారుడు అన్న ప్రాసన వేడుక నిర్వహించుకునేందుకు కుటుంబంతో సహా స్వగ్రామానికి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఆ తరువాత వీరు ఆటో లో రైల్వే కోడూరు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పమాదంలో అన్నప్రాసన నిర్వహించిన చిన్నారితో పాటు కృష్ణారెడ్డి కూతురు సాయి (8), భార్య పెంచలమ్మ (30), అతని అత్త మరణించారు. ఆటో డ్రైవర్ బాలకృష్ణ, కృష్ణారెడ్డిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో అయ్యలరాజుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచివేసింది.