Free Ration Distribution: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మోడీ ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్చి నెల వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిన సంగతి తెలిసింది. కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది మే నెల నుండి నవంబర్ వరకూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం (పీఎంజీకేఏవై) పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ చేశారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Free Ration Distribution: 18వ తేదీ నుండి 29వ తేదీ వరకూ ఉచిత బియ్యం
అయితే గత నెల (డిసెంబర్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి బియ్యం పంపిణీకి సకాలంలో ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఉచిత బియ్యం పంపిణీ జరగలేదు. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నేడు ఉచిత బియ్యం (పీఎంజికేఏవై) పంపిణీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి 29వ తేదీ వరకూ ఉచిత బియ్యం పంపిణీ రేషన్ ద్వారా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ లోగా రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ (పీడీఎస్ గోడౌన్) ల నుండి పిఎంజికేఏవై రైస్ తోలకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల (జనవరి) కోటా 5 కేజీల బియ్యంతో పాటు డిసెంబర్ నెల కోటా 5 కేజీలు కూడా కలిపి పది కేజీల వంతున పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు.
మార్చి నెల వరకూ ప్రధాన మంత్రి ఉచిత బియ్యం
కేంద్ర ప్రభుత్వం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజికేఏవై) తీసుకువచ్చింది. మనిషికి 5కేజీల వంతున బియ్యం, కార్డుకు కేజీ కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేసే ఈ స్కీమ్ ను తొలుత 2020 ఏప్రిల్ నెల నుండి జూన్ వరకూ అమలు చేశారు. తర్వాత దీన్ని నవంబర్ 2020 వరకూ పొడిగించారు. ఆ తరువాత ఈ స్కీమ్ ను 2021 మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నాడు కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో నవంబర్ 2020తో నిలుపుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గత ఏడాది మే నెల నుండి నవంబర్ వరకూ కార్డుదారుల్లో సభ్యుడికి అయిదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. మరల ఈ ఏడాది మార్చి వరకూ కేంద్రం ఈ స్కీమ్ ను పొడిగించింది.