Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంగా వినిపిస్తున్న అసైన్డ్ భూముల కేసులో సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో సీఐడీ బృందాలు బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల వెనుక జరిగిన తెర వెనుక మంత్రాంగానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో సీఐడీ టీమ్స్ ఉన్నాయని అంటున్నారు. దీంతో ఏం జరగనుందనే చర్చ వినిపిస్తోంది.
బాబు జమానాలో ఏం జరిగింది?
అసైన్డ్ భూముల అక్రమాలకు నాటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్సులో స్పష్టంగా ఉందని సీఐడీ చెబుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో అసైన్డ్, లంక భూములకు సంబంధించిన జీవోల వెనుకున్న నోట్ ఫైల్స్ ను కూడా సీఐడీ సేకరిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ఆధారాలు పాటు.. నోట్ ఫైల్స్ రూపంలో ఉన్న సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసుకుంటోంది. కొన్ని జీవోల జారీకి నాటి అధికారులు అభ్యంతరాలు తెలిపిన వివరాలన్నీ నోట్ ఫైల్సులో ఉన్నాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
బాబు ను బుక్ చేస్తారా?
ఇదిలాఉండగా, రైతుల విచారణ ప్రక్రియను సీఐడీ కొనసాగించింది. ఇప్పటికే తాడేపల్లిలో పలువురు రైతులను విచారించిన సిఐడి అధికారులు…ఇప్పుడు తుళ్లూరు తాసిల్దార్ కార్యాలయంలో మరో ముగ్గురు రైతులను విచారించారు. రాయపూడి, ఉద్దండరాయుని పాలెం గ్రామాలకు చెందిన రైతులను విచారించారు. రాజధాని పూలింగ్ సమయంలో తమ భూములను బలవంతంగా తీసుకుంటారని బ్రోకర్ లు చెప్పినట్టు రైతులు బయపెట్టారు. అసైన్డ్ భూములకు ఎటువంటి పరిహారం దక్కదు అని బ్రోకర్లు చెప్పిన మాటలు నమ్మి తక్కువ రేటుకు పొలం అమ్ముకున్న విషయం వాస్తవమేనని వారు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తమను ఎవరూ నాడు బెదిరించలేదని….భూమి పోతుంది అని భయపడి అమ్ముకున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు కావడంతో అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్లు తెలిపారు.