Gang Rape: ఓ పక్క రాష్ట్రంలో మహిళల భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే గుంటూరు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం మహిళలపై దుండగులు అత్యాచారం చేశారు. ఈ ఘటన మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హజరై బైక్ పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డ రోడ్డు సమీపంలో వీరిని కొందరు దుండగులు అడ్డగించారు. బైక్ పై ఉన్న వ్యక్తిపై దాడి చేసి అతని భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితురాలు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధి కాదంటూ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారు. ఘటన ఎక్కడ జరిగినా ఫిర్యాదు అందిన పోలీస్ స్టేషన్ లో జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధింత స్టేషన్ కు ఎఫ్ఐఆర్ ను బదిలీ చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కి తరలించారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. బైక్ పై వెళుతున్న దంపతులుపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడటం అమానుషమన్నారు. ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు బాధితురాలు వెళితే తమ పరిధి కాదంటూ పోలీసులు చెప్పడం దారుణమని అన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. జగన్ సర్కార్ లో ఏపి అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని దుయ్యబట్టారు. బాధితుల పరామర్శకు వెళ్లుంటే వేల మంది పోలీసులను రంగంలోకి దింపారని విమర్శించారు.