Gannavaram : కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్ పోర్టులో శనివారం పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ అవుతున్న ఎయిర్ ఇండియా విమానం అదుపుతప్పింది. రన్ వే పక్కనున్న స్తంబానికి విమానం రెక్క ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 63 మంది ప్రయాణీకులు ఉన్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ తెలిపారు. అయితే ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడటంతో ఎయిర్ పోర్టు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ అంతర్జాతీయ విమానం దోహా నుండి గన్నవరంకు చేరుకుంది. ఈ ఘటనతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. పైలెట్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక ల్యాండింగ్ సమయంలో ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తాకిందా లేదంటే ఎలా జరిగింది అనే విషయాలపై ఎయిర్ పోర్టు అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశాలు ఎర్పడటంతో ఎయిర్ పోర్టు అధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు.